Homeఆంధ్రప్రదేశ్‌AP Unemployment: ఉద్యోగాలెక్కడ జగనన్న.. ఏపీ సర్కారుపై నిరుద్యోగ యువత ఆగ్రహం

AP Unemployment: ఉద్యోగాలెక్కడ జగనన్న.. ఏపీ సర్కారుపై నిరుద్యోగ యువత ఆగ్రహం

AP Unemployment: ‘ఏటా జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నిరుద్యోగమన్న మాటే వినిపించకుండా చేస్తాం’.. విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ప్రకటనలివి. ఎన్నికల ముందు నిరుద్యోగ యువత ఓట్ల కోసం ఇచ్చిన హామీలు అటకెక్కాయి. మూడేళ్లు గడుస్తున్నా ఒక్క కొత్త నోటిఫికేషన్ ఊసు లేదు. మెగా డీఎస్సీ లేదు. ఏటా జనవరిలో జాబ్‌ కేలండర్‌ హామీ కార్యరూపం దాల్చలేదు. పోలీసు ఉద్యోగాల భర్తీ హామీదీ ఇదే పరిస్థితి. జగన్ ను నమ్మి దారుణంగా మోసపోయామనే ఆవేదన యువతలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై మాట నిలబెట్టుకోలేదు సరికదా ప్రైవేటు ఉద్యోగాలు కూడా దక్కని పరిస్థితి నెలకొంది.

AP Unemployment
AP Unemployment

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గాక ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్‌ ఉద్యోగాలపై ఒక ప్రకటన చేశారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా ఖాళీలు లేకుండా భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఉద్యోగాలు రానివాళ్లు ఎవరైనా ఉంటే బాధపడొద్దు. జనవరి అనేది ఎంతో దూరంలో లేదు. మళ్లీ జనవరి వస్తుంది. ఆ తర్వాత ఏడాది జనవరి వస్తుందని గుర్తుపెట్టుకోమని మాత్రం చెబుతున్నా’’ అని ప్రకటించారు. కానీ ఆ హామీలేవీ నెరవేర్చలేదు. గత ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇచ్చిన హామీలు అన్నీఇన్నీ కావు. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నట్టు మాట్లాడారు.

Also Read: Rupee Value: డాలర్ తో రూపాయి విలువ పడిపోతే లాభమా? నష్టమా? తెలుగు వారికి ఏం ప్రయోజనం?

తాను అధికారంలోకి వస్తే ‘అద్భుతం’ చేస్తానన్నట్టుగా చెప్పారు. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ వేశారు. ఆ తర్వాత 2018లో 7,900 ఉద్యోగాలకు మళ్లీ డీఎస్సీ వేశారు. ఎన్నికల ముందు వాటిపై జగన్‌ మాట్లాడుతూ… అసలు అవీ ఒక ఉద్యోగాలేనా? తానొస్తే మెగా డీఎస్సీనే అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఇప్పటివరకు కనీసం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. ఉద్యోగాలు వేయకపోగా, ఏకంగా 4760 ఎస్‌జీటీ ఉద్యోగాల భర్తీని రద్దు చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భవిష్యత్తులో కూడా భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 13,555 ఉపాధ్యాయ పోస్టుల్లో 4,764 ఉద్యోగాలను ఏకంగా రద్దు చేసేశారు.

చంద్రబాబే నయం
అయితే నిరుద్యోగ యువత ఇప్పుడు పశ్చాతపంతో ఉన్నారు. ఎంతో ఆశలతో గెలిపిస్తే జగన్ అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబే నయమని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు తన ఐదేళ్ల హయాంలో రెండు సార్లు గ్రూప్‌-2 నోటిఫికేషన్లు విడుదల చేశారు. 2016లో ఒకసారి 974 పోస్టులకు, 2018లో 443 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. గ్రూప్‌-1కు కూడా రెండుసార్లు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఒకసారి 74 పోస్టులు, మరోసారి 160 పోస్టులు భర్తీ చేశారు. డీఎస్సీ మూడుసార్లు నిర్వహించారు. మూడుసార్లు డీఎస్సీ ద్వారా సుమారు 22వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీచేసేలా చేశారు. పోలీసు శాఖలోనూ ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశారు. 2016లో 1057 ఎస్‌ఐ ఉద్యోగాలు, 4548 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేశారు.

AP Unemployment
jagan

2018లో 334 ఎస్‌ఐ ఉద్యోగాలు, 2723 కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇంకా ఇతర శాఖల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇన్ని చేస్తే ఇవేం ఉద్యోగాలని జగన్‌ తీసిపారేశారు. తాము అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు జగన్‌ ఊరూరా చెప్పారు. ఆయన అఽధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఆయన చెప్పిన హామీలేవీ నెరవేర్చలేదు. 2021 జూన్‌ 18వ తేదీన గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులు కేవలం 36గా ప్రకటించారు. ఈ ప్రకటన చూసి నిరుద్యోగులు విస్తుపోయారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఆ తర్వాత 9 నెలలకు గ్రూప్‌-1లో 110, గ్రూప్‌-2లో 130పోస్టులను అదనంగా కలిపారు. అన్నీ కలిపినా 276 లోపే. టీడీపీ హయాంలో భర్తీ చేసిన ఒక్క డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకు ఇవి దాదాపు సమానం. అప్పట్లో గ్రూప్‌-1, గ్రూప్‌-2లలో వేసిన డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులే 274. అసలు ప్రభుత్వ ఉద్యొగాల భర్తీ కార్యాచరణే లేకపోవడంపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేటు ఉద్యోగాలదీ అదే తీరు..
ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన అన్నది సాధారణంగా ప్రతిఏటా పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు పెరగడం సంగతి అటుంచితే, భారీగా తగ్గిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటు వల్ల సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ రంగంలోనే 34వేల మందికి, బీపీవో రంగంలో వేలమందికి ఉద్యోగాలొచ్చాయి. కానీ ఇప్పుడు జగన్‌ సర్కారు దెబ్బకు ఉన్న పరిశ్రమలు పారిపోతుండగా, కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. ఉద్యోగ అవకాశాలను ఈ ప్రభుత్వం చెడగొట్టేసిందని తీవ్ర విమర్శలున్నాయి. రాజధాని నిర్మాణం నుంచి విశాఖలో ఐటీ కంపెనీలు, రాయలసీమలో తయారీ రంగం పరిశ్రమలు ఏవీ జరగలేదు. కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలోని యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఉపాధి కల్పనలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి జాబ్‌మేళాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Also Read:Amanchi Krishna Mohan: జనసేన వైపు ఆమంచి క్రిష్ణమోహన్ చూపు.. రకారకాల ఆఫర్లతో కట్టడి చేస్తున్న జగన్
Recommended Videos
స్పూర్తినిచ్చే కథ: Triangle Love Story of Dinesh Karthik , Nikita and Murali Vijay || Ok Telugu
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకి షాక్ | MLA Alla Ramakrishna Reddy | YCP Gadapa Gadapaku Program
2070లో ప్రపంచం ఎలా ఉండబోతుంది..?|| What Will be the World in 2070 || Artificial Intelligence Effect

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version