
ఓ వైపు కరోనా.. మరోవైపు మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా మహమ్మరి ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. అయితే మండే ఎండల నుంచి రిలీఫ్ పొందే గుడ్ న్యూస్ ను వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోకి మరో 24గంటల్లో రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరో మూడ్రోజుల్లో అంటే జూన్ 1న నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనునున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది.
ఛత్తీస్గఢ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు మధ్య ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తరించిందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు తెలిపింది. అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. మరో రెండ్రోరోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుతాయని తెలిపింది. అయితే వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే 6, 7తేదిల్లోగా రాయలసీమకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు ఉండాలని కోరింది.