Google Chrome: స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. గూగుల్ వాడకం పెరిగిపోయింది. గతంలో ఏదైనా సెర్చ్ చేయాలంటే కంప్యూటర్లు వాడేవారు. కంప్యూటర్లకు మించి సౌకర్యాలు స్మార్ట్ ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. చాలామంది తమ ఫోన్ లోనే అన్ని పనులు కానిస్తున్నారు. యూజర్లు చేసే ప్రతి పనికి గూగుల్ తో అనుసంధానం అవ్వడం ఖచ్చితం అయిపోయింది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ వాడకం కూడా పెరిగిపోయింది. అయితే గూగుల్ క్రోమ్ లో కొన్ని లోపాలు ఉన్నట్టు ఇటీవల ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం గుర్తించింది. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. లేకపోతే సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.. గూగుల్ క్రోమ్ లో CIVN-2024-0103 పేరుతో బగ్ ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం గుర్తించింది. దీనివల్ల విండోస్, మ్యాక్, లినక్స్ వంటి మూడు ప్లాట్ ఫారంలు వినియోగించే యూజర్ల మీద తీవ్రమైన ప్రభావం పడుతుందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరించింది.
ఈ బగ్ వల్ల హ్యాకర్లు బ్రౌజర్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. బుక్ మార్క్ లు, బ్రౌజింగ్ హిస్టరీని తెలుసుకుంటారు. బగ్ వల్ల హ్యాకర్స్ క్రోమ్ బ్రౌజర్ ను రిమోట్ గా వాడుకుంటారు. ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా తెలియని, అనుమానాస్పద వెబ్ సైట్ లను ఓపెన్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలియని ఐడీ నుంచి వచ్చిన ఈమెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గూగుల్ బ్రౌజర్ ని కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ కోసం ముందు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. పైన కుడివైపు మూడు చుక్కలు కనిపిస్తాయి. అందులో సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్రోమ్ పై క్లిక్ చేసి అప్డేట్ వస్తే వెంటనే చేసుకోవాలి. అంతేకాదు అనుమానాస్పద వెబ్ సైట్లను క్లిక్ చేయకపోవడమే మంచిది. కొంతమంది హ్యాకర్లు లింక్ పంపించి.. దానిని క్లిక్ చేయగానే మన ఫోన్ లోకి ప్రవేశిస్తారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి పిన్ నంబర్లు తెలుసుకొని ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఊడ్చేస్తారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీంతో ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పరిశోధన సాగించగా.. అసలు విషయం వెలుగు చూసింది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన నేపథ్యంలో.. కచ్చితంగా శక్తివంతమైన లాక్ కోడ్ రూపొందించుకోవాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సూచిస్తోంది. సోషల్ మీడియా యాప్స్, ఆన్లైన్ పేమెంట్ యాప్స్ వాడే విషయంలోనూ ఇదే తరహా సెక్యూరిటీ కోడ్ రూపొందించుకోవాలని సూచిస్తుంది. అనుమానాస్పద మెసేజ్ లు చదవకపోవడమే చెబుతోంది. మీ ఖాతాలో డబ్బులు వేశామనో, మీకు బహుమతులు వచ్చాయనో ఎవరైనా చెబితే వాటిని అసలు నమ్మకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పకూడదు.. పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ ఫోన్ నెంబర్ కు ఓటిపి వచ్చిందని.. అది మాకు చెప్పాలని అడిగితే.. కచ్చితంగా ఆ ఫోన్ కాల్స్ కట్ చేయాల్సిందే. ఎందుకంటే ఏ బ్యాంకులు కూడా ఓటిపి చెప్పమని అడగవు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More