Site icon OkTelugu

TDP Vs YCP: ఎన్నికల వరకు కేసులు తప్పవు.. తేల్చుకోవాల్సింది టిడిపి శ్రేణులే

TDP Vs YCP

TDP Vs YCP

TDP Vs YCP: చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ విషయంలో జగన్ తో పాటు వైసీపీ సర్కార్ స్పష్టమైన వైఖరితో ఉంది. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తోంది. వీలైనంత వరకు వారిని జైల్లో ఉంచేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడంలో సక్సెస్ అయ్యింది. దీని నుంచి బయటపడేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ఒక్క కేసుతోనే చంద్రబాబును విడిచి పెట్టేలా వైసీపీ సర్కార్ లేదు. మరిన్ని కేసుల్లో చంద్రబాబును ఇరికించడం ద్వారా ఆయనకు ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ప్రజలకు దూరం చేయాలని భావిస్తోంది. ఈ లక్ష్యంతోనే పక్కగా అడుగులు వేస్తోంది.

తొలుత స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు చంద్రబాబుపై నమోదయింది. అటు తరువాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసు, చిత్తూరు జిల్లా అంగళ్ళలో జరిగిన హింసాత్మక ఘటనల కేసు, తాజాగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు కేసులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మూడు కేసులకు చంద్రబాబును బాధ్యుడిగా చూపి.. రిమాండ్ ను విధించాలన్నది వైసీపీ సర్కార్ ప్లాన్. అంటే మొత్తంగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి బయటకు వచ్చినా.. మిగతా మూడు కేసుల్లో ఏదో ఒక దానిలో రిమాండ్ విధించాలన్నదే వ్యూహంగా తెలుస్తోంది.

మరోవైపు లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ ను ఎందుకు విడిచి పెట్టారని జగన్ అధికారులను ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ ను సైతం జైల్లో పెట్టాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫైబర్ నెట్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ చిన్న అవకాశం దొరికినా లోకేష్ ను మూసేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ఉండడంతో.. అప్పటి వరకు కేసులతో ఉక్కిరి బిక్కిరి చేయాలన్నదే జగన్ సర్కార్ ప్లాన్ గా తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేసుల నుంచి బయటపడడం, ప్రజాక్షేత్రంలోకి వచ్చి వైసీపీ సర్కార్ చర్యలను ఎండగట్టడం నాయకత్వం ముందున్న పని. అయితే ఈ విషయంలో ఎలా ముందడుగు వేస్తారో చంద్రబాబుకి తెలియాలి. ప్రస్తుతం ఈ కేసులతో టిడిపి శ్రేణుల ఆత్మస్థైర్యం పై జగన్ గట్టిగానే దెబ్బ కొట్టారు. దీనిని ప్రతిఘటించేందుకు టిడిపి నాయకత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. అవసరమైతే బ్రాహ్మణిని రంగంలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే పవన్ టిడిపి తో పొత్తుకు ముందుకు రావడంతో.. అవసరమైతే కూటమి నాయకత్వాన్ని పవన్ కు అప్పగించే అవకాశాలపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version