Site icon OkTelugu

Pawan Kalyan: క్షణం తీరిక లేకుండా పవన్.. ఈ నెల 17 తర్వాత ఏపీకి దూరంగా

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కొద్దిరోజుల కిందట కృష్ణా జిల్లాలో వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానికి తాత్కాలికంగా బ్రేక్ నిస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 తర్వాతే పునః ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలు, సినిమా షూటింగ్, వ్యక్తిగత విదేశీ పర్యటన తదితర కారణాలతో వారాహి పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత ప్రారంభమైన వారాహి యాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పార్టీల శ్రేణులు యాత్రకు పోటెత్తారు. అయితే సినిమా షూటింగ్ లు ఒకవైపు పెండింగ్లో ఉండడం, ఇంట్లో శుభకార్యం ఉండడంతో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ నిచ్చారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన యాత్ర అవనిగడ్డ, మచిలీపట్నం, కైకలూరు, పెడన నియోజకవర్గాల్లో నిర్వహించారు. అక్టోబర్ 5 నుంచి యాత్రకు బ్రేక్ నివ్వగా.. అప్పటినుంచి పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈనెల 12 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. అనంతరం పవన్ సినిమా షూటింగ్లకు హాజరుకానున్నారు. 17 వరకు షూటింగ్ షెడ్యూల్ కొనసాగునుంది. ఈ లోగా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చి జైలు నుంచి బయటకు వస్తే పవన్ ప్రత్యేకంగా కలవనున్నారు. కీలక చర్చలు జరపనున్నారు.

ఈ నెల 17 తర్వాత పవన్ విదేశాలకు వెళ్తున్నారు. సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లి తంతు ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చాలామంది ఇటలీకి చేరుకున్నారు. అక్కడ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో నిమగ్నమయ్యారు. 17 తర్వాత కుటుంబ సమేతంగా పవన్ ఇటలీ వెళ్ళనున్నారు. ఈలోగా పార్టీ పరంగా తీసుకోవలసిన చర్యలు, రెండు పార్టీల మధ్య పొత్తు అంశాలు, ఉమ్మడి కార్యాచరణ వంటి వాటిపై దృష్టి పెట్టనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అటు పెండింగ్ సినిమాలు పూర్తి చేస్తూనే.. ఇటు రాజకీయాలపై ఫోకస్ పెంచారు. చంద్రబాబు అరెస్టు తరువాత పొత్తు ప్రకటన చేశారు. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడంతో రెండు పార్టీల సమన్వయ బాధ్యతను పవన్ తీసుకున్నారు. ఒకవేళ చంద్రబాబుకు బెయిల్ లభించకపోతే రెండు పార్టీలకు ఉమ్మడి నాయకత్వం వహించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.

Exit mobile version