2020 స్థానిక ఎన్నికలు దగ్గరౌతున్న నేపథ్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. నిన్నటికి నిన్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి, వైసీపీలో చేరారు. ఈ రోజు టీడీపీకి మరో గట్టిషాక్ తగిలింది. కడప జిల్లాకి చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత, మాజీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సుబాన్ బాషా టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేశ్ బాబు ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. సుబాన్ బాషాతో తరలివచ్చిన ఆయన అనుచరులకు అంజద్ బాషా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కడపలో ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ పార్టీని వీడి తన కుటుంబ సభ్యులు, పలువురు నేతలు, కార్యకర్తలతో బుధవారం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పాటు టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న సతీష్ రెడ్డి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో కడప జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కనబడుతోంది.