నాటి తెలంగాణ పంటలను చెడగొట్టిందెవరు?

అది మా తాతల కాలం.. 1950కి ముందు తెలంగాణ… రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు.. ఇలా పౌష్టికాహారం నిండుగా ఉండే ఆహార దినుసుల పంటలే పండేవట.. ఈ వరి పంట అక్కడో ఇక్కడో మాత్రమే విసిరేసినట్టు పండించేవారట.. అప్పటివాళ్లు అంతా గడుక(మొక్కజొన్న, జొన్నలతో చేసే కిచిడీ) తినేవారు. చుట్టాలు వస్తేనే బియ్యం వండి పెట్టేవారు. పౌష్టికాహార పంటలు వేసి అవే తింటూ ఆ గడుకతోనే వారు నూరేళ్లు బతికారు. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో మల్టీ గ్రెయిన్ […]

Written By: admin, Updated On : May 12, 2020 7:44 pm
Follow us on

అది మా తాతల కాలం.. 1950కి ముందు తెలంగాణ… రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు.. ఇలా పౌష్టికాహారం నిండుగా ఉండే ఆహార దినుసుల పంటలే పండేవట.. ఈ వరి పంట అక్కడో ఇక్కడో మాత్రమే విసిరేసినట్టు పండించేవారట.. అప్పటివాళ్లు అంతా గడుక(మొక్కజొన్న, జొన్నలతో చేసే కిచిడీ) తినేవారు. చుట్టాలు వస్తేనే బియ్యం వండి పెట్టేవారు. పౌష్టికాహార పంటలు వేసి అవే తింటూ ఆ గడుకతోనే వారు నూరేళ్లు బతికారు. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో మల్టీ గ్రెయిన్ పంటల సాగు ఎక్కువగా ఉండేది. ఇక్కడి నుంచి నిజాం నవాబులు ఏకంగా జపాన్ లాంటి దేశాలకు మన పప్పు ధాన్యాలను ఎగుమతి చేసేవారు. తెలంగాణ ధాన్యానికి నాడు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం.. ఆంధ్రాలో తెలంగాణ కలవడం.. ఆంధ్రుల వరి తెలంగాణపై రుద్దబడింది. క్రమక్రమంగా ఇక్కడ ప్రధాన పంటైంది.. అంతా వరి పంటనే వేస్తుండడంతో తెలంగాణలోనాటి మల్టీ గ్రెయిన్ పంటలు కనుమరగయ్యాయి. కేసీఆర్ సైతం కాళేశ్వరం నీరు ఇస్తూ వరిని ప్రోత్సహిస్తుండడంతో పౌష్టికాహార పంటలైన రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవల సాగు తెలంగాణలో కనుమరుగైంది.

*ఆంధ్రుల వరి.. తెలంగాణపై రుద్దబడింది..
సాధారణంగా పౌష్టికాహార పంటలైన రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు పంటలు మూడు నెలల్లోనే కాపుకొస్తాయి. కానీ అత్యంత దిగుబడి ఇవి ఇవ్వవు.. అదే వరి పంట వేస్తే బాగా దిగుబడి వస్తుంది. దీనికి మద్దతు ధర కూడా ఉంది. నాడు ఆంధ్రాలో ప్రధాన పంట అయిన వరికి నాటి ఆంధ్రా పాలకులు మద్దతు ధర కల్పించారు. తెలంగాణ రైతులు కూడా అదే సాగు చేయడం ప్రారంభించారు. పాలకులూ దాన్నే ప్రోత్సహించారు. దీనికే మద్దతు ధర ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు కూడా క్రమంగా వరి సాగుకు ఎగబడ్డారు. దీంతో ఒకప్పుడు నిజామాబాద్ లో ప్రాజెక్టుల కింద మాత్రమే పండే వరి పంట ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పంట అయ్యింది. ఏపీని మించి పండుతోంది.

*పాలకుల పాపం.. తెలంగాణకు శాపం..
నాటి ఆంధ్రా పాలకులే కాదు.. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిన కేసీఆర్ సైతం మొదటి ఐదేళ్లలో వరిపంటకే ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చారు. రేషన్ ద్వారా బియ్యంని పంచుతుండడంతో దాని సాగుకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఈ ఏడు బాగా సాగైంది. ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం తెలంగాణలో దిగుబడి వచ్చి దేశంలోనే రికార్డు కొట్టి దేశానికే ధాన్యాగారంగా మారింది. అదే ఏపీలో కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఏపీని సైతం దాటేసి తెలంగాణలో వరిపంట పండిందంటే అర్థం చేసుకోవచ్చు. దీనికంతంటికి నాడు ఆంధ్రా ముఖ్యమంత్రులు, నేడు కేసీఆర్ వరిపంటపై చూపిన ప్రేమే కారణం.. మద్దతు ధర ఇస్తుండడంతో రైతులంతా ఈ పంటనే పండిస్తున్నారు.

*వరి ఈజీ.. మిగతావి కష్టం.
నిజానికి వరిపంట పండించడం చాలా ఈజీ. నాటు వేసి వదిలేస్తే రోజు నీళ్లు పెడితే సరిపోతుంది. పైగా దీనికి అడవి జంతువులు, కోతుల బాధతక్కువ. అదే ఇతర పంటలు వేస్తే పక్షులు, కోతులు, అడవి జంతువుల నుంచి కాపాడుకోవాలి. పైగా రోజు ఆ పంటతో పని ఉంటుంది. అందుకే ఈజీ అయిన వరి సాగుకే రైతులు మొగ్గుచూపుతారు.

*వరి వేస్తే రైతుబంధ్ కట్ అంట..
వరి ఈ ఏడు రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయ్యింది. వర్షాలకు తోడు కాళేశ్వరం నీరు అందుబాటులోకి రావడంతో తెలంగాణ పంట పండింది. కానీ మొత్తం వరినే పండింది. అదే తెలంగాణకు శాపమైంది. ఒక్క వరి తప్పితే ఏదీ పండలేదు. పప్పుధాన్యాలు.. కందులు, రాగులు.. రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు.. ఏవీ రైతులు పండించలేదు. వరి, పత్తి మాత్రమే పండింది. నీళ్లు ఉంటే వరి.. లేకపోతే పత్తి అన్నట్టుగా తెలంగాణలో రైతుల పరిస్థితి ఉంది. ఇబ్బడిముబ్బడిగా వచ్చిన వరిని ఏం చేసుకోవాలో కేసీఆర్ కు అర్థం కావడం లేదు. ఇప్పటికే మిల్లులు, ధాన్యాగారాలు నిండిపోయాయి. అందుకే ఈసారి వరి వద్దు సర్కార్ చెప్పిన పంటలే వేయాలని.. వేయకపోతే రైతుబంధ్ కట్ చేస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నారు. అయితే ఒక్కసారి అలవాటుపడ్డ రైతులు పంట మార్చడానికి ఇష్టపడడం లేదు. దీంతో అదే శాపమవుతోంది.

*అన్ని పంటలు వేస్తే గిట్టుబాటు ధర.. ఆరోగ్యం
కరోనాతో ప్రపంచం మారింది. కల్తీలేని పౌష్టికాహారంపై జనాల్లో మక్కువ పెరిగింది. ఇక అందరికీ రోగాలు పంచుతున్న వరికంటే ఇప్పుడు అంతా ‘సిరిధాన్యాల’ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. వెనుకటి ఆహార పంటలైన రాగి, జొన్న, పచ్చజొన్న, బొబ్బర్లు, ఉలవలు తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వీటికి బోలెడు డిమాండ్. విదేశాల్లో అయితే ఎగబడుతున్నారు. కానీ ఇంత డిమాండ్ ఉన్నా ఆయా పంటలు పండించడానికి మాత్రం రైతులు మొగ్గుచూపడం లేదు. ప్రభుత్వం చొరవతీసుకొని రైతులకు అవగాహన కల్పిస్తే పంట పండుతుంది. భారీగా మద్దతు ధర దక్కుతుంది.. ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ దిశగా తెలంగాణ సమాజం.. కేసీఆర్ సర్కార్ మొగ్గు చూపాల్సి ఉంది.

–నరేశ్ ఎన్నం