Homeజాతీయ వార్తలుSonia Gandhi All-party Meet: విపక్షాలను ఐక్యం చేసే సోనియాగాంధీ ప్లాన్

Sonia Gandhi All-party Meet: విపక్షాలను ఐక్యం చేసే సోనియాగాంధీ ప్లాన్

Sonia Gandhi Opposition MeetSonia Gandhi All-party Meet: దేశంలో మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా 2024 చేరుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ తోపాటు టీఎంసీ, ఎన్సీపీ, శివసేన తదితర పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అంకురార్పణ జరుగుతోంది. మోడీకి తగ్గుతున్న జనాదరణను బేస్ చేసుకుని కేంద్రంలో పాగా వేయాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో సరైన దిశానిర్దేశం లేకపోవడంతో పార్టీ నిస్తేజంగా మారి అన్ని ఎన్నికల్లో పరాజయం పాలైంది. దీంతో ఇక పార్టీ పని అయిపోయింది అనుకునే సమయంలో పార్టీని గాడిలో పెట్టాలని ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ను పట్టుకున్నారు. దీంతో మెల్లమెల్లగా పార్టీలో జవసత్వాలు పెరుగుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కన్నేసింది.

దేశంలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆర్థిక మందగమనం, కొవిడ్ వైఫల్యాలు, పెగసస్ వ్యవహారం, రైతు వ్యతిరేక చట్టాలు, పెరుగుతున్నధరలు ఇలా అనేక అంశాలు ప్రభుత్వానికి సంకటంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. 2024 లక్ష్యానికి ఇప్పటి నుంచే పావులు కదలపాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయాలని చూస్తోంది. ప్రజాక్షేత్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం సాగించాల్సిన విషయం గుర్తించినట్లు తెలుస్తోంది. విపక్షాలను ఏకం చేసే పనిలో సోనియాగాంధీ(Sonia Gandhi) ప్రణాళిక రచిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీల నాయకత్వ లోపం కనిపిస్తోంది. రెండు సార్లు ఎన్డీయే చేతిలో పరాభవం పాలైన కాంగ్రెస్ కు సరైన నాయకుడు లేడు. దీంతో మునిగిపోయే నావగా తయారైంది పరిస్థితి. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. దీంతో పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంలో పడింది. ఇప్పటికైనా పార్టీని నడిపించే నాయకుడు ఉంటేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే పార్టీలో సీనియర్లు సూటిపోటి మాటలతో పార్టీని అభాసుపాలు చేస్తున్నారు. దీంతో ఎన్డీఏ ను ఢీకొట్టడం అంటే మామూలు విషయం కాదు.

ఇక కాంగ్రెస్ పార్టీని దిశానిర్దేశం చేసే బాధ్యతను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేపట్టారు. దీంతో ఆ పార్టీ ఇటీవల కొంత మేర మెరుగుపడినట్లు కనిపిస్తోంది. అయితే పీకే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశమై భవిష్యత్ వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీని 2024 ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చేందుకు పీకే తన శక్తియుక్తులు ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టే పనిలో భాగంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఆయన పడినట్లు సమాచారం.

గతంలో జరిగిన ఐదు స్టేట్ల ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి తరువాత విపక్షాల్లో ఆశలు పెరుగుతున్నాయి. బీజేపీ ఓటు బ్యాంకు తగ్గడంతో ఇక తమ పని సులువు కాబోతోందనే ఉద్దేశంతో విపక్షాలు జట్టు కడుతున్నాయని సమాచారం. దీనికి తోడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు లో పీకే వ్యూహాలతో అక్కడి పార్టీలు విజయం సాధించడంతో ఇక కేంద్రంలో పాగా వేయాలనే లక్ష్యంతో పీకే మార్గాలు వెతుకుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ కనీసం 136 సీట్లు మిగతా పార్టీలు 137 సీట్లు సాధిస్తే విక్టరీ సులువు అవుతుందని భావిస్తున్నారు.

దేశంలో సర్వేలు సైతం విపక్షాలకు అనుకూలంగా మారుతున్నాయి. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే క్రమంలో విపక్షాల్లో ఐక్యతారాగం కోసం కృషి చేస్తున్నారు. అయితే నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మోడీ చరిష్మా కూడా తగ్గుతుండడంతో విపక్షాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నాయి. ఈ మధ్య రాహుల్ గాంధీ పాపులారిటీ కూడా పెరుగుతుందని తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకు కదులుతున్నట్లు సమాచారం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version