Sathankulam custodial death case : ఒంటిమీద ఖాకీ చొక్కా పడగానే చాలామంది తామేదో దైవంశ సంభూతులమని.. గొప్ప వ్యక్తులమని భావిస్తుంటారు. చేతిలో లాఠీ ఉందని.. ఎవరినైనా తుక్కు రేగ్గోట్టొచ్చు అనుకుంటారు. కానీ పోలీసు వ్యవస్థతోపాటు.. మన దేశంలో న్యాయ వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. అన్యాయానికి గురైన వారికి.. న్యాయస్థానమే అండగా నిలుస్తూ ఉంటుంది.
2020లో తమిళనాడులోని సాతంకుళ ప్రాంతానికి చెందిన జయరాజు, అతని కుమారుడు బెన్నిక్స్ అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు మొబైల్ షాప్ తెరిచి ఉంచారని పోలీసులు అభియోగాలు మోపారు. ముందుగా జయరాజును జూన్ 19న అరెస్టు చేసి తీసుకెళ్లారు. తన తండ్రిని అరెస్ట్ చేయడంతో అతని కుమారుడు బెన్నీక్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాడు. అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని జ్యుడీషియల్ కస్టడీకి జూన్ 23న తరలించారు. గంటల వ్యవధిలోనే వారిద్దరు చనిపోయారు.. అయితే పోలీసులు తీవ్రంగా హింసించడం వల్ల.. అతిగా కొట్టడం వల్ల వారిద్దరు చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నాడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసు కాస్త కేంద్ర దర్యాప్తు బృందం చేతిలోకి వెళ్ళింది. కేంద్ర దర్యాప్తు బృందం అధికారులు నాటి ఘటనలో ప్రధాన అభియోగాలు ఎదుర్కొన్న పోలీసులను అరెస్ట్ చేశారు.. ఆ తర్వాత విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ కేసులో ఓ మహిళ కానిస్టేబుల్ కీలకమైన వాంగ్మూలాన్ని ఇచ్చింది. అది సిబిఐ అధికారులకు కీలక ఆధారంగా మారింది.
జయరాజు, బెన్నిక్స్ పై ఆరోజు రాత్రంతా పోలీసులు దాడి చేశారు. విపరీతంగా కొట్టారు. తీవ్రంగా హింసించారు. అదంతా కూడా మహిళా కానిస్టేబుల్ చూసింది. అంతేకాదు స్టేషన్లో గోడలు.. బల్లలు.. లాఠీలపై రక్తపు మరకలు పడ్డాయని ఆమె వెల్లడించింది. అయితే ఈ వ్యవహారం మొత్తం బయటికి రాకుండా ఉండడానికి సిసిటీవీ రికార్డులు ప్రతిరోజు యధావిధిగా డిలీట్ అయ్యే విధంగా పోలీసులు మార్పులు చేశారు. ఇది సిబిఐ అధికారులకు కీలక ఆధారంగా మారింది.
మహిళా కానిస్టేబుల్ కీలకమైన వాంగ్మూలం ఇవ్వడం.. ఇతర ఆధారాలు స్పష్టంగా లభించడం.. ఫోరెన్సిక్ పరీక్షలో రక్తపు నమూనాలలో ఉన్న డీఎన్ఏ.. చనిపోయిన వారి డిఎన్ఏ తో సరి పోలడంతో సిబిఐ అధికారులు వారిద్దరిని చంపింది పోలీసులేనని నిర్ధారించారు. న్యాయస్థానానికి కీలక నివేదిక అందించారు. దీంతో మద్రాస్ లోని మదురై బెంచ్.. ఆ తొమ్మిది మంది పోలీసు అధికారులకు ఉ*రి శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది.
పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలి. అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా ఉండాలి. కానీ బతుకుదెరువు కోసం సెల్ ఫోన్ షాప్ నిర్వహించే తండ్రి కొడుకులు మీద ఈ స్థాయిలో కర్కశత్వాన్ని ప్రదర్శించి ఉద్యోగాన్ని కోల్పోయారు. చివరికి జీవితాలను కూడా కోల్పోయారు. ఈ పోలీసులు చేసిన దుర్మార్గం ఎంతోమంది పోలీసు అధికారులకు గుణపాఠం.