Telangana Congress
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్కు మంచి రోజులు రాబోతున్నాయా.. అసెంబ్లీ ఎన్నికల వేళ చేరికలకు నేతలు ఉత్సాహం చూపుతున్నారా అంటే అవుననే సమాధాన వస్తోంది ఆ పార్టీ నేతల నుంచి. 2009 తర్వాత కాంగ్రెస్ నుంచి పోవడం తప్ప చేరిన దాఖలాలు లేవు. 2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2004లో బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్కు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. ఇద్దరు మంత్రులు కూడా అయ్యారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపారు. 2009 ఎన్నికల తర్వాత ఇదే పరిస్థితి. ఇక ఆ తర్వాత వైఎస్సార్ హఠాన్మరణం, మరణం తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం కారణంగా కాంగ్రెస్లో చేరికలు ఆగిపోయాయి. 2014 ఎన్నికల తర్వాత అయితే కాంగ్రెస్ నుంచే నేతలు, ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం మొదలైంది. దాదాపు పదేళ్లుగా ఆ పార్టీ రోజురోజుకూ పతనమవుతూ వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ పార్టీలో చేరికకు డిమాండ్ ఏర్పడింది. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీలో చేరేందుకు వివిధ పార్టీల్లోని నేతలు ఆసక్తి చూపుతున్నారు.
దశాబ్దం తర్వాత..
పార్టీ నుంచి పోవడమే కానీ.. వచ్చి చేరేవారు లేకం కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా డీలా పడిపోయింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీలో చేరికలకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో ఎవరైనా చేరాలంటేం ముందుగా కాంగ్రెస్ నేతలే బతిమాలుకునేవాళ్లు. వాళ్లు పెట్టే డిమాండ్లకు అంగీకరించి పార్టీలో చేర్చుకునేవారు. కానీ ఇప్పుడు చాలా మంది వస్తామని.. కబురు చేస్తున్నారు వారిలో చాలా మంది టిక్కెట్ హామీ కోరుతున్నప్పటికీ పరిస్థితిని బట్టి సర్దుకుపోవడానికి కూడా రెడీ అవుతున్నారు.
కాంగ్రెస్లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు
అధికార బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోచేరడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన గతంలో రేవంత్రెడ్డిని ఓడించడానికి కొడంగల్పై దృష్టి పెట్టి.. తన సీట్లో ఓడిపోయారు. కొడంగల్లో తమ్ముడ్ని గెలిపించుకున్నారు. అదే మైనస్ అయింది. అక్కడ్నుంచి గెలిచిన పైలట్ రోహిత్రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ ఆయనకే టిక్కెట్ కన్ఫార్మ్ చేశారు. దీంతో పట్నంకు పార్టీ మారక తప్పని పరిస్థితి. బీఆర్ఎస్లో టిక్కెట్ చాన్స్ లేని బలమైన నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
రాహుల్ సమక్షంలో..
రాహుల్ గాంధీం వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాహుల్ సమక్షంలో భారీగా చేరికలకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. మల్లు రవి నేతృత్వంలో ఓ కమిటీని రేవంత్ నియమించారు. ఈ కమిటీ.. చేరే వారి జాబితాను రెడీ చేస్తోంది. చాలా రోజులుగా పార్టీ నుంచి పోతున్న వాళ్లే కానీ.. వస్తామని చెప్పి మరీ బతిమాలుకుటున్న పరిస్థితి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.