RBI Plastic Currency Notes: కరెన్సీ నోట్లు చూడగానే చాలామందికి ఒక రకమైన ఆనందం.. ఆసక్తి ఉంటాయి. ఆగర్భ శ్రీమంతుడి నుంచి మొదలు పెడితే పేదవాళ్ల వరకు కరెన్సీ నోట్లు చూస్తే మురిసిపోతారు. వాటిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటారు. తడిసిపోయినా.. వాటిని వేరే విధంగా మడతపెట్టినా.. అవి చినిగిపోతాయని భయపడిపోతుంటారు. పైగా కొంతకాలంగా అసలు నోట్లను పోలివున్న నకిలీ నోట్లు మార్కెట్లో విపరీతంగా కనిపిస్తున్నాయి.
నకిలీ నోట్లకు చెక్ పెట్టే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను ఎక్కువ కాలం ఉండేవిధంగా.. ఆత్యాధునిక ఫీచర్లతో ప్లాస్టిక్ కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగం తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
కోవిడ్ తర్వాత మన దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. చిన్న స్థాయిలో మాత్రమే యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం నగదు రూపంలో చెల్లింపులు జరుగుతున్నాయి. డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిగితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దృష్టి పెడతారని చాలామంది భావిస్తున్నారు. అందువల్లే వ్యాపారులు నగదు ఇవ్వాలని కోరుతున్నారు. కొన్ని సందర్భాలలో ధర తగ్గించి చెల్లింపులు స్వీకరిస్తున్నారు.
ఇక మనదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయం అంతగా లేదు. స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా తక్కువగానే ఉంది. అందువల్లే ఆన్లైన్ చెల్లింపులు తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. అందువల్లే నగదు వినియోగం పెరిగిపోతున్నది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు మన దేశంలో 42.86 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే ఇది 11.5% ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అందువల్లే రిజర్వ్ బ్యాంకు ప్లాస్టిక్ కరెన్సీ ని తెరపైకి తీసుకురావాలని భావిస్తోంది.. ఇక మనదేశంలో పాత, చినిగిన కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధ్వంసం చేస్తూ ఉంటుంది. వాటి స్థానంలో కొత్త నోట్లోను విడుదల చేస్తూ ఉంటుంది. 2023 – 24 సంవత్సరంలో కరెన్సీ నోట్ల ప్రింటింగ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,101 కోట్లను ఖర్చుపెట్టింది.
2024 -25 సంవత్సరంలో కరెన్సీ ప్రింటింగ్ ఖర్చు ఏకంగా 6372 కోట్లకు పెరిగింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల వ్యయం ఎక్కువైంది. ఇక ఇటీవల కాలంలో పాట్నా, ముంబై నగరాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశాలు నిర్వహించింది. అక్కడ ప్లాస్టిక్ కరెన్సీ విషయం గురించి చర్చ నడిచింది. అయితే ముందుగా 10, 20 నోట్లను ప్లాస్టిక్ విధానంలో విడుదల చేయాలని.. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా.. మిగతా నోట్లకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
