Posters Jagan Wife to Liquor Scam: రాజకీయాలు హద్దులు దాటుతున్నాయి. రాజకీయాల మాటున వికృత పోకడలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత హననానికి దిగుతున్నారు. ముఖ్యంగా ఏపీలో రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత వైరంగా మారిపోతోంది. ఇప్పటి వరకూ కామెంట్స్ కు దిగిన వారు ఇప్పుడు నేతల కుటుంబసభ్యులు, మహిళల పేరుతో వీధికెక్కుతున్నారు. రెండు రోజుల కిందట విజయవాడ బెంజ్ సర్కిల్ లో 1995లో చంద్రబాబు డెక్కన్ క్రానికల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వుయ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్’ పతాక శీర్షికన వచ్చిన పెపర్ క్లిప్పింగులను పోస్టర్లుగా అతికించారు. అది మరువక ముందే ‘మా ఆవిడ పతివ్రత’ అంటూ చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఫొటోలతో కూడిన పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఎవరు అడిగారు సార్ మిమ్నల్ని అంటూ అల్లు అర్జున్ ఫొటోతో ఒక క్యాప్షన్ ఉంచారు. అయితే ఇంతలా రాజకీయాలు దిగజారిపోయాయా అంటూ సగటు మనిషి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జుగుప్సాకర రాజకీయాలకు దిగడం దారుణమని విపక్షాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ వైసీపీ పేటీఎం బ్యాచ్ పనేనంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
మరోవైపు ఇదంతా ఎన్నికల వ్యూహకర్తల పనేనన్న అనుమానాలున్నాయి. ప్రస్తుతం వైసీపీకి ప్రశాంత్ కిశోర్ సహచరుడు రుషిరాజ్ సమన్వయకర్తగా సేవలందిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆ బృందం ఏపీలో తిష్ట వేసింది. రాజకీయ పరిణామాలు గమనించి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడమే ఈ బృందం పని. ఏదైనా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందటే ఈ బృందం రంగంలోకి దిగుతుంది. ప్రజలను డైవర్ట్ చేసే పని చేస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నేపథ్యంలో ప్రభుత్వానికి ఇంటా బయటా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
Also Read: Cattle On Roads: ప్రధాని సొంత రాష్ట్రంలో దారుణం: 500 కోట్లు మంజూరు చేసినా… ఆకలితో అలమటిస్తున్నాయి
అదే సమయంలో అమరావతికి మద్దతుగా రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ సమయంలో చంద్రబాబు కుటుంబాన్ని బయటకు తెచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా ప్రచారానికి మరింత పదును పెట్టింది.
ఢిల్లీ లిక్కర్ మూలాలు తాడేపల్లిలో ఉన్నాయంటూ టీడీపీ, బీజేపీ ఆరోపణలు చేస్తూ వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే సీఎం జగన్ భార్య భారతి పేరు బయటకు వచ్చింది. దీంతో విపక్షాలు ఆమెను టార్గెట్ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన జగన్ మంత్రులకు, పార్టీ నేతలకు చీవాట్లు పెట్టారు. సీఎం భార్యనే విమర్శిస్తుంటే మీరు ఏం చేస్తున్నట్టు అని తలంటారు. దీంతో వైసీపీ మంత్రుల నుంచి నాయకుల వరకూ చంద్రబాబు కుటుంబంపై టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పోస్టర్లు సైతం ప్రదర్శించారు. మౌనంగా ఉంటే చేతకానివారమవుతామని భావించారో ఏమో.. టీడీపీ నాయకులు కూడా డోసు పెంచారు. భారత్ పే పేరడీగా భారతీ పే అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇది తెగ వైరల్ అవుతోంది. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ ఏకంగా మా ఆవిడ పతివ్రత అంటూ పోస్టర్లు పెట్టేశారు. అయితే ఏపీలో జరుగుతున్న జుగుప్సాకర రాజకీయాలు చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారు.
Also Read: Bank Service Charges: బ్యాంకు సేవలన్నీ ఉచితం కాదు: వేటికెంత వసూలు చేస్తారో తెలుసా…
