మంగళవారం కారు దగ్ధమవుతున్న విషయం తెలుసుకుని స్థానికులు సెల్ ఫోన్ లో బంధించారు. ప్రమాదవశాత్తు తగలబడుతుందని భావించారు. కానీ అందులో మృతదేహం ఉందని ఎవరికి అనుమానం రాలేదు. అయితే కారు నెంబర్ ఆధారంగా టీఎస్ 15 ఈహెచ్ 4005 అని గుర్తించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అది మెదక్ కు చెందిన ధర్మకార్ శ్రీనివాస్ (47)గా తేలింది. అనంతరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన చేగుంట ఎస్సై సుభాష్ కు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
హతుడికి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవని గుర్తించారు. తన భర్త మధ్యాహ్నం బయటకు వెళ్లారని ఫోన్ చేస్తే కలవలేదని భార్య హైందవి తెలిపింది. తన భర్తకు ఉన్న వివాహేతర సంబంధాలతో తరచూ గొడవలు జరిగేవని ఆమె పేర్కొనడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్తిరాస్థి వ్యాపార లావాదేవీల్లో కూడ గొడవలు జరిగేవని తెలుస్తోంది. ఈ కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహం గుర్తింపులో మొదట కష్టమైనా తరువాత తేల్చారు. శ్రీనివాస్ కు కృత్రిమ దంతాలుంటాయని కుటుంబ సభ్యుల సమాచారంతో చనిపోయింది శ్రీనివాస్ అని నిర్ధారించారు. మెదక్ లోని ఓ వ్యాపారి కుమారుడైన శ్రీనివాస్ కు స్థానికంగా ఓ సినిమా థియేటర్ కూడా ఉంది. గతంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కొన్నేళ్ల క్రితం ఓ వర్గానికి చెందిన గ్రంథం ప్రతులను దహనం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు.