స్టీల్ ప్లాంట్‌పై చివరి ఆశ..- జగన్‌ లేఖపై చలనం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ.. ఈ ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్రానికి సంకటంగా మారిందట. స్టీల్‌ ప్లాంట్‌పై తీసుకున్న నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలా లేక నిర్ణయంలో ఏమైనా మార్పులు చేయాలా అన్న దానిపై కేంద్రం వద్ద కూడా స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖను ఆయన సంబంధిత విభాగానికి పంపారు. అక్కడి నుంచి […]

Written By: Srinivas, Updated On : March 22, 2021 12:17 pm
Follow us on


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ.. ఈ ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్రానికి సంకటంగా మారిందట. స్టీల్‌ ప్లాంట్‌పై తీసుకున్న నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలా లేక నిర్ణయంలో ఏమైనా మార్పులు చేయాలా అన్న దానిపై కేంద్రం వద్ద కూడా స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖను ఆయన సంబంధిత విభాగానికి పంపారు. అక్కడి నుంచి వచ్చే సమాధానమే ఇప్పుడు ఫైనల్‌ కానుంది.

Also Read: ఆ రెండు రాష్ట్రాల పైనే కాంగ్రెస్‌ ఆశలు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్ పేరుతో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను నష్టాల్లో ఉందన్న సాకుతో ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో ఆందోళనలు నానాటికీ పెరుగుతున్నాయి. విశాఖ నగరంలో తాజాగా ఉక్కు గర్జన పేరుతో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, స్థానికులు సభ నిర్వహించారు. స్టీల్‌ ప్లాంట్‌పై ముందడుగు వేస్తే ఊరుకోబోమన్న హెచ్చరికలు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని లైట్‌ తీసుకోలేని పరిస్ధితి. ఇప్పటికే ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం చేస్తున్న ప్రకటనలు కార్మికుల్లో మరింత ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ, కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా సూచిస్తూ సీఎం జగన్ ఇప్పటికే రెండుసార్లు ప్రధాని మోడీకి లేఖలు రాశారు. వీటిలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయకుండా నిలబెట్టేందుకు అవకాశం ఉందని సీఎం జగన్‌ ప్రధానికి సూచించారు. ప్రధాని అనుమతిస్తే అఖిలపక్షంతో వచ్చి మరిన్ని విషయాలు పంచుకుంటానని కోరారు. దీంతో ప్రధాని కార్యాలయం సీఎం జగన్‌ లేఖను ముందుగా పెట్టుబడుల ఉపసంహరణ విభాగానికి పంపింది. ఇప్పుడు ఆ లేఖ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది.

Also Read: అసెంబ్లీ వైపు చూపు.. కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ

వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ ప్రధాని కార్యాలయం నుంచి తమకు అందిన సీఎం జగన్ లేఖపై స్పందించాల్సి ఉంది. అయితే.. ఆలస్యం అవుతుండటంతో వైసీపీ ఎంపీల ఒత్తిడి మేరకు ప్రధాని కార్యాలయం తిరిగి సదరు శాఖను స్పందించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ వైజాగ్‌ స్టీల్‌పై రాసిన లేఖపై స్పందించాలని పెట్టుబడుల ఉపసంహరణ విభాగాన్ని కోరినట్లు తాజాగా ప్రధాని కార్యాలయం సమాచార హక్కు కింద దాఖలైన ఓ పిటిషన్‌కు సమాధానం ఇచ్చింది. దీంతో త్వరలోనే ఈ శాఖ నుంచి ఏపీ సీఎంవోకు సమాధానం రావాల్సి ఉంది. సీఎం జగన్ రాసిన లేఖను ప్రధాని కార్యాలయం పెట్టుబడుల ఉపసంహరణ విభాగానికి పంపడం వెనుక మతలబు ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఏపీ సీఎంవోకు పంపే సమాధానం ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్