Petrol Price Latest News India 2026: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచం చమురు సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జల సంధిని మూసివేసింది. దీంతో రవాణా స్తంభించింది. చమురు ధరలు 10 శాతం పెరిగాయి. దీంతో చాలా దేశాలు చమురు ధరలు పెంచాయి. నియంత్రణ పాటిస్తున్నాయి. మన దేశంలో కూడా నిల్వలు తగ్గుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటికే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తాజాగా దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ధరల స్థిరత్వానికి కేంద్రం వ్యూహం..
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 42% పెరిగినా (70 నుంచి 100+ డాలర్లు), దేశీయ ధరలను స్థిరంగా ఉంచడానికి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ధరల పెరుగుదలను నియంత్రించింది. మరోవైపు సరఫరా పూర్తిగా నిలిచిపోయినా 60 రోజులకు సరిపడా క్రూడాయిల్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఏదైనా అత్యవసర పరిస్థితిలో దేశానికి భద్రత కల్పిస్తుంది. ఇరాన్, సౌదీ అరేబియాపై ఆధారపడటం తగ్గించి, అమెరికా, రష్యా, ఇతర దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది.
హై–ఆక్టేన్ పెట్రోల్పై స్వల్ప పెంపు
కేంద్రం ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చింది. సాధారణ పెట్రోల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు, కేవలం ప్రీమియం హై–ఆక్టేన్ పెట్రోల్ (స్పీడ్ వంటివి) ధరలను మాత్రమే లీటరుకు రూ. 2 నుంచి రూ.2.35 మేర పెంచినట్లు తెలిపింది. మొత్తం పెట్రోల్ విక్రయాల్లో ప్రీమియం కేటగిరీ వాటా కేవలం 2 నుంచి 4 శాతం మాత్రమే. సామాన్య వాహనదారులపై ఈ పెంపు ప్రభావం ఉండదని సుజాత శర్మ స్పష్టం చేశారు.
ఎల్పీజీ ధరలపైనా స్పష్టత..
గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను కూడా పెంచే ప్రణాళికలు లేవని కేంద్రం ప్రకటించింది. అయితే, వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరలను మాత్రం ఇటీవల స్వల్పంగా సవరించింది. సోషల్ మీడియాలో పెట్రోల్ ధరలు భారీగా పెరగబోతున్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇవన్నీ వదంతులు మాత్రమేనని కేంద్రం తెలిపింది.
పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల మధ్య కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను పెంచే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేయడం సామాన్యులకు పెద్ద ఊరట. 60 రోజుల వ్యూహాత్మక నిల్వలు, ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు, వైవిధ్యమైన సరఫరా మార్గాలతో కేంద్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధ పరిణామాలను కేంద్రం నిరంతరం గమనిస్తోంది. అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
