
ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న అద్దె బస్సుల్లో పని చేసే డ్రైవర్ల సమస్యలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి జీతాలు అందకపోవడంతో డ్రైవర్ల కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. సుమారు 8 వేల మంది డ్రైవర్లు ఆ అద్దె బస్సుల్లో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. మార్చి నెల నుంచి తమకు జీతాలు లేకపోవడంతో జీవనం చాలా కష్టంగా మారిందని డ్రైవర్లు పార్టీ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆ కుటుంబాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన రీతిలో ఆదుకోవాలని, డ్రైవింగ్ లో పదేళ్ళ పైబడిన అనుభవం ఉన్నా వీరికి తక్కువ వేతనాలే అందుతున్నాయన్నారు.
ఈ డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగులు కారనీ, అద్దె బస్సుల యజమానులే ఆ బాధ్యత చూసుకోవాలని ప్రభుత్వం, సంస్థ భావించడం సరికాదని చెప్పారు. సంస్థకు అద్దె బస్సుల ద్వారా సేవలు అందించిన కార్మికులు అనే దృక్పథంతో వారికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు సహాయం చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అద్దె బస్సులకు పని చేస్తున్న డ్రైవర్ల కష్టాల గురించీ ఆలోచన చేయాలన్నారు. ఈ అద్దె బస్సుల నిర్వహణ, మరమ్మతులపై ఆధారపడ్డ శ్రామిక విభాగం చిరుద్యోగుల గురించి కూడా సంస్థ ఆలోచన చేయాలని కోరారు.