Operation Sindoor: 2025, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కల్పులు జరిపారు. మతం తెలుసుకుని మరీ హిందువులను మట్టుబెట్టారు. 26 మంది అమాయకులు చనిపోయారు. ఈ దారుణ ఘటనకు ప్రతీకారంగా మే 7న భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. ఈ సైనిక చర్యలో దేశం కొంతమంది ధీర వీరులను కోల్పోయింది. వారి త్యాగాన్ని గుర్తుంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం వారి పేర్లను ఏడాది తర్వాత అధికారికంగా ప్రకటించింది. జాతీయ యుద్ధ స్మారకంలో చేర్చింది.
అమరవీరులు వీరే..
ఈ ఆపరేషన్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.
ఈ వీరులందరూ దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతూ అమరులయ్యారు. యోధుల పేర్లు ఇలా ఉన్నాయి.
1. సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్)
2. రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్ (జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్, 4వ బెటాలియన్)
3. లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ (5వ ఫీల్డ్ రెజిమెంట్)
4. హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (237వ ఫీల్డ్ వర్క్షాప్)
5. సార్జెంట్ సురేంద్ర కుమార్ (వాయుసేన 39వ వింగ్)
6. అగ్నివీర్ మురళీ నాయక్ (851వ లైట్ రెజిమెంట్)
వీరులకు గౌరవం..
రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్కు మరణానంతరం మూడవ అత్యున్నత యుద్ధ పురస్కారం ‘వీర చక్ర’ లభించింది. సార్జెంట్ సురేంద్ర కుమార్కు ‘వాయు మెడల్’ ఇచ్చి గౌరవించారు. ఈ పురస్కారాలు వారి అసాధారణ ధైర్యం, త్యాగానికి గుర్తుగా ఇచ్చారు.
తెలుగు వీరుడి త్యాగం..
అమరుల జాబితాలో అగ్నివీర్ మురళీ నాయక్ తెలుగు నేలకు చెందిన వ్యక్తి. శ్రీసత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన ఆయన 2022లో అగ్నివీర్గా ఎంపికయ్యారు. మొదట పంజాబ్, అస్సాం ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ పాకిస్తాన్తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. ఆయన త్యాగం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణం.
జాతీయ యుద్ధ స్మారకంలో శాశ్వత స్థానం..
కేంద్రం ఈ అమరవీరుల పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో చేర్చింది. ఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్ వద్ద ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక శిలాఫలకంపై వారి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నారు. ఈ చర్య దేశం వారి త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని స్పష్టం చేస్తుంది.
ఈ వీరుల త్యాగం దేశ రక్షణకు అంకితమైన సైనికుల సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. వారి జ్ఞాపకం భారతీయులందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
