ఏపీకి ఒకటే రాజధాని.. జగన్ ఫిక్స్.. కారణమిదే

ఏపీలో మూడు రాజధానుల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఆ గొడవ అటు అమరావతి వేదికగా ఇంకా నడుస్తూనే ఉంది. ఇటు.. హైకోర్టులోనూ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మంచి చలిలో అసెంబ్లీ వేదికగా.. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి కాక పుట్టించాడు వైఎస్‌ జగన్‌. అప్పటి నుంచి మొదలైన ఆ చిచ్చు ఇంకా చల్లారడం లేదు. అయితే.. గతంతో పోలిస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు అమరావతి డిమాండ్‌ను జగన్ […]

Written By: Srinivas, Updated On : April 7, 2021 10:58 am
Follow us on


ఏపీలో మూడు రాజధానుల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఆ గొడవ అటు అమరావతి వేదికగా ఇంకా నడుస్తూనే ఉంది. ఇటు.. హైకోర్టులోనూ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మంచి చలిలో అసెంబ్లీ వేదికగా.. మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి కాక పుట్టించాడు వైఎస్‌ జగన్‌. అప్పటి నుంచి మొదలైన ఆ చిచ్చు ఇంకా చల్లారడం లేదు. అయితే.. గతంతో పోలిస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు అమరావతి డిమాండ్‌ను జగన్ స్థానిక ఎన్నికల్లో తిరస్కరించారని వైసీపీ గట్టిగా భావిస్తోంది.

దాంతో తనదైన శైలిలో రాజధానుల వ్యవహారానికి ముగింపు పాడాలని అనుకుంటోంది. మూడు రాజధానులు ఏంటి, అన్నీ ఒక్క చోట ఉంటేనే పాలన బాగా సాగుతుంది. రాజధానులను ముక్కలు చేయడం తుగ్లక్ నిర్ణయం అంటూ టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా విమర్శించాయి. విమర్శిస్తూనే ఉన్నాయి. అదే విధంగా మేధావులు, విద్యావంతులు కూడా ఏపీ లాంటి ఆర్థికంగా చితికిన రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నది గుది బండగా పేర్కొంటున్నారు. అయితే.. వీరి మాటల్లో వాస్తవం లేకపోలేదు. కేవలం పదమూడు జిల్లాల ఏపీకి మూడు రాజధానులు ఎందుకు అన్న ప్రశ్న కూడా పెద్దల నుంచి వస్తున్న వేళ జగన్‌లో కొత్త ఆలోచనలు ఇప్పుడు మొదలయ్యాయా అనే సందేహాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో పెద్దనగరం విశాఖ. అన్ని రకాలుగా వనరులు ఉన్న సిటీ. రెడీమేడ్‌గా రాజధానిగా మార్చుకోవచ్చు. మొదటి నుంచి వైసీపీ ఇదే చెబుతూ విశాఖకు తరలిపోవాలనుకుంటోంది. ఇక ఏపీలో రెండేళ్ల పాలనకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికీ కూడా జగన్ ని మెచ్చి మరీ మునిసిపాలిటీలలో సహా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో జగన్‌కు విశాఖ మీద మోజు మరింతగా పెరిగిపోయిందట. దాంతో విశాఖనే శాశ్వత రాజధానిగా, ఏకైక‌ రాజధానిగా ఎందుకు చేయరాదు అన్న చర్చ కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని అనగానే ఇప్పుడు వైసీపీ ఫోకస్‌ విశాఖ మీద పడినట్లుగా పలువురు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న కేజీహెచ్‌కి ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయలను జగన్ తాజాగా మంజూరు చేశారు. అలాగే విమ్స్‌కు మరో రూ.250 కోట్లు, ఘోషాసుపత్రికి వంద కోట్లు కేటాయించారు. అనకాపల్లిలో వైద్య కళాశాల కోసం కూడా 500 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది విశాఖ వైద్య చరిత్రలో ఎన్నడూ చూడని వ్యవహారమే. అంతే కాకుండా విశాఖ నుంచి భోగాపురం వరకూ బీచ్ కారిడార్‌‌ను అభివృద్ధి చేయాలనుకోవడం, విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి భోగాపురం వరకూ ఆరు లైన్ల రోడ్లకు ప్రతిపాదించడం, టూరిజం సర్క్యూట్‌గా మెగా సిటీని డెవలప్ చేయాలనుకోవడం, మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు ఊపిరి పోయడం వంటివి చూస్తుంటే రానున్న రోజుల్లో విశాఖే ఏపీకి ఏకైక రాజధాని అన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. కర్నూల్‌లో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ అని ప్రతిపాదించినా జగన్ మరోసారి గెలిస్తే మాత్రం అమరావతి అసెంబ్లీ కూడా విశాఖకు షిఫ్ట్ అయినా కావచ్చు అన్నది పలువురు విశ్లేషకుల వాదన కూడా. చూద్దాం జగన్‌ నిర్ణయం ఎలా ఉండబోతోందో..?