Homeఆంధ్రప్రదేశ్‌TDP EX MLAs: వైసీపీలో చేరిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు.. అనర్హత వేటు సాధ్యమేనా?

TDP EX MLAs: వైసీపీలో చేరిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు.. అనర్హత వేటు సాధ్యమేనా?

TDP EX MLAs: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం వెలుగులోకి రావడం గమనార్హం. టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురిపై అనర్హత వేటు వేయాలని వైసిపి నాయకత్వం కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీలో చేరిన నలుగురు టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టిడిపి కోరింది. ఈ నేపథ్యంలో శాసనసభ కార్యదర్శి స్పందించారు. టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లకు నోటీసులు జారీచేశారు. ఈనెల 29న హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

అటు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలపై సైతం అనర్హత వేటు వేయాలని వైసీపీ పట్టుబడుతోంది. ఇప్పటికే వీరికి సైతం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎటువంటి చర్యలకు దిగుతారో చూడాలి. ఎమ్మెల్యేలు స్వయంగా హాజరై వివరణ ఇస్తారని.. సంతృప్తికరమైన వివరణ ఇస్తే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా ఆమోదంపై హైకోర్టును ఆశ్రయించారు. మూడు సంవత్సరాల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ప్రకటించారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం గంటా శ్రీనివాసరావు రాజీనామాను పెండింగ్ లో ఉంచారు. గంటా శ్రీనివాసరావు వ్యక్తిగతంగా కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరినా ఫలితం లేకపోయింది. కానీ సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముంగిట గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. అయితే రాజ్యసభ ఎన్నికలు ఉన్నందున.. దురుద్దేశంతోనే రాజీనామాను ఆమోదించారని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారు. అందుకే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 60 మంది సిట్టింగులను మార్చారు. మరో 20 మందిని మార్చుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజ్యసభ ఎన్నికలు ఎదురయ్యాయి. సంఖ్యా బలంగా మూడు రాజ్యసభ స్థానాలు వైసిపి దక్కించుకునే అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు జగన్ కు ఇబ్బంది తెచ్చిపెట్టాయి. మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు జగన్ జాగ్రత్త పడుతున్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారని.. టిడిపిలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి ప్రయత్నిస్తున్నారని టిడిపి అనుమానిస్తోంది. అందుకే టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు టిడిపి పట్టుబడుతోంది. శాసనసభ కార్యదర్శి నోటీసులు ఇచ్చిన తరుణంలో.. తదుపరి చర్యలు ఎలా ఉంటాయో అన్న చర్చ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version