Pahalgam terror attack NIA chargesheet: పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ పదేపదే ఆరోపించింది. ప్రపంచ వేదికల ముందు కూడా దీనిని ప్రకటించింది. అయితే దీనిపై కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.. అయితే ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి గురించి జాతీయ దర్యాప్తు సంస్థ కీలక విషయాలను బయటపెట్టింది. దీంతో పాకిస్తాన్ అసలు రూపం మరోసారి ప్రపంచ దేశాల ముందు బయటపడుతుంది.
పహల్గాం దాడి నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కొంతకాలంగా విచారణ చేపడుతుంది.. ఈ సందర్భంగా తాజాగా కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయి. “పర్యాటకులకు స్వర్గధామం లాగా ఉండే పహల్గాం లో భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసిందని.. ఉగ్రవాదులు ఆరోపించారు. పాకిస్తాన్ మీద లేనిపోని ఆరోపణ చేసేందుకు భారత్ ప్రయత్నించిందని” ఉగ్రవాదులు తప్పుడు ప్రచారం చేశారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఈ దారుణానికి సంబంధించిన వ్యవహారం మొత్తం పాకిస్థాన్ నుంచి జరిగిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన దర్యాప్తులో తేలిన వివరాల ద్వారా ప్రకటించింది. అంతేకాదు వీటికి సంబంధించిన పక్కా ఆధారాలను కూడా బయట పెట్టింది.
లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు అనుబంధం సంస్థగా ఉండే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన హ్యాండ్లర్లు పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించారు. ఉగ్రదాడులు జరిగిన అనంతరం.. దీనికి అమ్మదే బాధ్యత అంటూ కాశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించడం విశేషం. ఆ తర్వాత దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితిలో కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. దీంతో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కాస్త వెనకడుగు వేసింది. అంతేకాదు తాము ఉపయోగిస్తున్న టెలిగ్రామ్ ఛానల్ హ్యాక్ అయిందని ప్రకటించింది.
ఈ ఛానల్ పాకిస్తాన్ లోని కైబర్ ఫంక్తుక్వా నుంచి ఆపరేట్ అయిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేపట్టిన దర్యాప్తులో తేలింది. మరోవైపు ఇదే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మరో ఛానల్ రావల్పిండి ప్రాంతం నుంచి ఆపరేట్ అయినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది.. అంతేకాదు ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఫైజల్, హబీబ్, అంజా అనే ఉగ్రవాదుల ఐపీ అడ్రస్.. ఫోన్ నెంబర్ల ఆధారంగా.. పాకిస్తాన్లో ఉన్న సూత్రధారులతో వీరికి బలమైన సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ తన ఇన్వెస్టిగేషన్లో ప్రకటించింది.. అయితే ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన భారత దళాలు ఉగ్రవాదులలో ముగ్గురిని అంతం చేశాయి. వారి వద్ద ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి. ఆ ఫోన్లను పాకిస్తాన్లోనే వారు కొనుగోలు చేసినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో బయటపడింది. ఇందులో ఒక ఫోన్ లాహోర్ ప్రాంతంలో ఉన్న చిరునామాకు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశారు. మరో ఫోన్ కరాచీ ప్రాంతంలో కొన్నారు.
