CM KCR: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ పోరులో అంతిమ విజయం అధికార టీఆర్ఎస్ పార్టీని వరించింది. ఎనిమిదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ సమయంలో మునగుడో విజయం గులాబీ పార్టీకి బూస్డ్ ఇచ్చింది. ముగుగోడు గెలుపును ‘ముందస్తు’కు బాటలు వేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉప ఎన్నికల బలం.. అసలు బలమేనా అన్న సందేహాలు కూడా ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన నంధ్యాల ఉప ఎన్నికను గుర్తు చేసుకుంటున్నారు.

నంద్యాల ఫలితం ఏం చెప్పింది..
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉపఎన్నిక వచ్చింది. టీడీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ టీడీపీ గెలిచింది. అయితే ఆ విజయం అసంతృప్తి నిప్పుల మీద దుప్పటి కప్పినట్లయింది. అంతా సానుకూలత ఉందనుకుని టీడీపీకి అసలు ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది.
మునుగోడూ అంతే..
ఇప్పుడు తెలంగాణలో సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరిగిన మునుగోడు ఉపఎన్నిక కూడా అంతే. ఈ ఉపఎన్నిక విజయంతో టీఆర్ఎస్కు సానుకూలత ఉందనుకుంటే అది రాజకీయ అమాయకత్వమే. రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి. కానీ.. ప్రజలు తమ వైపే ఉన్నారన్న ఓ కాన్ఫిడెన్స్ను మాత్రం ఈ విజయం టీఆర్ఎస్కు ఇచ్చింది. అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందన్న ఓ అభిప్రాయాన్ని ఈ ఫలితం పటాపంచలు చేస్తుంది. పక్క చూపులు చూసేవారిని కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది.

ఎజెండా లేని ఎన్నిక..
మునుగోడు ఉపఎన్నికకు ఎజెండా అంటూ లేదు. ఇక్కడ ఓటింగ్ ఎజెండా ఏమిటి అన్నది డిసైడ్ చేసుకోలేదు. తమకు ఎక్కువ ప్రయోజనం కల్పించిన వారికో.. లేకపోతే మరో కారణంతోనే ఓటేశారు కానీ.. ఎమ్మెల్యేలను లేదా.. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడాని కాదు. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రచారాంశాలు .. ఎజెండా పూర్తిగా మారిపోతాయి. ఉపఎన్నికల్లో ప్రజలు ఓట్లేసేది ప్రభుత్వాలను మార్చడానికి కాదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓట్లేసేది.. ప్రభుత్వాలను మార్చడానికి లేదా.. కొనసాగించడానికి. ఈ ఎజెండా ప్రకారం ప్రజలు ఓట్లేస్తారు. అందుకే ఉపఎన్నికలతో పోలిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వస్తాయి. గత అనుభవాలు కూడా ఇదే నేర్పాయి. రాజకీయ పార్టీలు ఉపఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా.. ఎలాంటి ప్రభావం ఉండదు. ఫైనల్స్లో మాత్రం ప్రజలు ఓట్లేసే విధానం వేరు. అందుకే ఈ విషయంలో తెలంగాణ రాజకీయ పార్టీలు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.