Monkey Menace In Villages: ఒకప్పుడు గుట్టలు ఉండేవి. ఆ గుట్టలలో పండ్ల చెట్లు ఉండేవి. కోతులకు.. ఇతర జంతువులకు ఆ గుట్టలు ఆలవాలంగా ఉండేవి. ఫలితంగా గ్రామాలలోకి అవి వచ్చేవి కాదు. ఎప్పుడో ఒకసారి అవి దారి తప్పి గ్రామాల్లోకి వస్తే.. గ్రామస్తులు ఆశ్చర్యంగా చూసేవారు. ఎందుకంటే నాటి కాలంలో కోతులు అత్యంత అరుదుగా వచ్చేవి. కానీ ఇప్పుడు గుట్టలు మాయమయ్యాయి. అడవులు తగ్గిపోయాయి. అభివృద్ధి పేరుతో చెట్లను కొట్టివేయడం ఎక్కువైపోయింది. దీంతో ఆవాసం లేకపోవడంతో కోతులు గ్రామాల మీద పడుతున్నాయి. వాటి సంతతిని పెంచుకొని ఏకంగా మనుషులపై దాడులు చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో మనుషుల ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతున్నాయి.
కోతుల వల్ల పంట పొలాలు కూడా తీవ్రంగా నాశనమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పప్పు దినుసుల పంటలు.. నూనె గింజల పంటల విస్తీర్ణం తగ్గిపోవడానికి ప్రధాన కారణం కోతులు. గత కొంతకాలంగా ఈ పంటలకు గిట్టుబాటు ధర అధికంగా ఉంటున్నది. అయినప్పటికీ కోతులు ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో రైతులు ఈ పంటలను సాగు చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. మొక్కజొన్న పంట విస్తారంగా వేస్తున్నప్పటికీ.. దానిపై కూడా కోతులు దాడులు చేస్తున్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతున్నది. అందువల్ల చాలా మంది రైతులు వరి, పత్తి, పసుపు, మిరప సాగు చేస్తున్నారు.. వీటిపై కూడా కొన్ని సందర్భాల్లో కోతులు దాడులు చేస్తుండడం విశేషం.
కోతుల బెడదను తగ్గించడానికి ఇటీవల కాలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు హామీలు ఇచ్చారు. గ్రామాలలో కోతులను పట్టించి బయటికి పంపిస్తామని పేర్కొన్నారు. అలాంటి హామీలు ఇచ్చినవారు ఎన్నికల్లో గెలిచారు. వారంతా కూడా ప్రత్యేకమైన వ్యక్తులను పిలిపించి కోతులను పట్టించి.. బయటికి పంపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నరసింహుల పేట మండలంలో కొంతకాలంగా కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కోతులను నివారించడానికి గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామంలో కి ప్రవేశించి చిన్నారుల నుంచి పెద్దల దాకా దాడులు చేస్తున్న కోతులను బయటికి పంపించడానికి గ్రామస్తులు కంకణం కట్టుకున్నారు. తమ సమస్య పరిష్కారానికి గ్రామస్తులు మొత్తం ఏకమయ్యారు. ఇంటికి 500 చొప్పున.. ఎకరానికి 500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా సేకరించిన తర్వాత వచ్చిన డబ్బుతో కోతులను నిపుణులైన వ్యక్తులను పిలిపించి.. బయటికి పంపిస్తారని తెలుస్తోంది.
ఈ ప్రాంతంలో గతంలో కోతులు ఉండేవి కాదు. అయితే కొంతకాలంగా కోతుల సంఖ్య ఇక్కడ పెరిగిపోయింది. కోతులు విపరీతంగా దాడులు చేస్తున్నాయి. పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి. ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో తట్టుకోలేక గ్రామస్తులు మొత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రత్యేకమైన వ్యక్తులను పిలిపించి కోతులను పట్టిస్తామని.. సుదూర ప్రాంతాలకు తరలిస్తామని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.