Jagan- Chandrababu: ఏపీలో మద్య నిషేధం అన్నది లేదిక. మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్న ప్రభుత్వాలు నిషేధించలేమని తేల్చేశాయి. గత ఎన్నికల్లో మద్య నిషేధం అమలుచేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పుకొచ్చారు. మద్యంతో కుటుంబాలు అధోగతి పాలవుతున్నాయని.. టీడీపీ ఏలుబడిలో ఊరూరా బెల్ట్ దుకాణాలు వెలిశాయని కూడా అప్పట్లో ఆరోపించారు. అక్క చెల్లెళ్ల కన్నీటిని తుడిచేందుకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తామని ప్రకటించారు. ఆ హామీతో దండిగా ఓట్లు దండుకున్నారు. తీరా పవర్ లోకి వచ్చాక అమలు సాధ్యం కాదని తేల్చేశారు. మద్యం షాపులను టేకోవర్ చేసుకొని సొంతంగా నడపడం ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మద్యం విక్రయాలు కొన్నిరోజులు జరగక తప్పదని మడత పేచీ వేశారు. ఏడాదికి 25 శాతం షాపులనుతగ్గించి.. నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తానని.. మద్యం ధరలు పెంచి ఫైవ్ స్టార్ హోటల్ కే పరిమితం చేస్తానని కూడా చెప్పారు. ఆయన చెప్పినట్టు ఏడాదికేడాది షాపులు తగ్గలేదు. బార్లు,, వాకిన్ స్టోర్ ల పేరిట పెరిగాయే తప్ప తగ్గలేదు. దీంతో జగన్ సంపూర్ణ మద్య నిషేధం చేస్తారన్నది ఉత్తమాటగా తేలిపోయింది.

జగన్ ఫెయిల్యూర్స్ ను ప్రస్తావించి.. తాను అధికారంలోకి వస్తే చక్కదిద్దుతానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఒక మద్యం విషయంలో మాత్రం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. మద్య నిషేధం అమలుచేస్తానని చెప్పడం లేదు. కానీ మద్యం షాపులుంటాయని సంకేతాలిస్తున్నారు. అందులో మార్పులు చేర్పులు చేస్తానని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు కల్లుగీత కార్మికులకు ఒక హామీ ఇచ్చారు . తాను అధికారంలోకి వస్తే మద్యం షాపుల్లో 10 శాతాన్ని కల్లుగీత కార్మికులకు కేటాయిస్తానని చెప్పారు. అంటే మద్య నిషేధం లేనట్టే కదా. ఆయన మాటల ద్వారా తప్పకుండా మద్యం షాపులు ఉంటాయని.. పాలసీనే మార్చతానని చెప్పినట్టయ్యింది.

ఏపీలో ఒక్క ఎన్టీఆర్ తప్పించి సంపూర్ణ మద్య నిషేధం జోలికి ఎవరూ వెళ్లలేదు. అది ఎంత సాహసంతో కూడుకున్న పనో తెలుసు గనుక వైఎస్సార్, చంద్రబాబు దాని జోలికి పోలేదు. అయితే తాను ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో ఉన్న జగన్ సంపూర్ణ మద్యనిషేధానికి ముందుకొచ్చారు. ఏకంగా మేనిఫెస్టోలో చేర్చారు. తాను ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావించే నవరత్నాల్లో సైతం మద్య నిషేధాన్ని పెట్టారు. కానీ అమలుచేయలేకపోయారు. దానిని మభ్య పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. అవి వర్కవుట్ కావని కూడా తెలుసు. దేశంలో సక్సెస్ ఫుల్ లీడర్లుగా, ముఖ్యమంత్రులుగా ఉన్న వారు సైతం మద్యం జోలికి పోలేదు. అంతెందుకు పక్కన ఒడిశాలోని మద్యంతో పాటు సారా దుకాణాలు కూడా ఉంటాయి. ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న వాటి జోలికి పోయే సాహసం సీఎం నవీన్ పట్నాయక్ చేయలేదు. మద్య నిషేధంలో జగన్ ఫెయిలయ్యారు. మద్యం ధరలను పెంచారు. మందుబాబులు నచ్చే బ్రాండ్లను దూరం చేశారు. అందుకే చంద్రబాబు కూడా మద్యం పై విభిన్న ప్రకటనలు చేశారు. క్రమేపీ ఈ డోసుల సంఖ్య పెంచే అవకాశముంది. మంచి బ్రాండ్లు ఇస్తానని… ధర తగ్గిస్తానని ప్రకటించే అవకాశముంది. అయితే అది జగన్ మద్యం పాలసీలో ఫెయిల్యూర్స్ ను ముందు పెట్టి ప్రకటించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.