Kerala Government: కేరళంలో అధికారంలోకి వచ్చిన కొత్త UDF ప్రభుత్వం మహిళల సంక్షేమం, విద్యార్థినుల ఆరోగ్యం, ఉద్యోగినుల హక్కుల పరిరక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ, అనాథల సంక్షేమం వంటి అంశాలను కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా విద్యార్థినులకు ప్రతి నెల మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవులు ఎందుకంటే?
రుతుక్రమ సమయంలో అనేక మంది విద్యార్థినులు శారీరక, మానసిక అసౌకర్యాలను ఎదుర్కొంటుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రతి నెల మూడు రోజుల ప్రత్యేక రుతుక్రమ సెలవులు ఇవ్వాలని కేరళం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థినుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, వారి విద్యపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.
మహిళా ఉద్యోగులకు కుటుంబం, ఉద్యోగం మధ్య సమతుల్యత కల్పించేందుకు జీతంతో కూడిన ఆరు నెలల ప్రసూతి సెలవులను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రసవానంతర కాలంలో తల్లి, శిశువు ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, ఈ సెలవులు మహిళలకు మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు శిశు సంరక్షణకు తగిన సమయం కల్పిస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
ఉద్యోగిణుల కోసం మరో కీలక నిర్ణయంగా, 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలు, సంస్థల్లో నాణ్యమైన డేకేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. చిన్నపిల్లలను చూసుకునే బాధ్యతతో ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితులు రాకుండా చేయడం, మహిళల ఉపాధి అవకాశాలను పెంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.
కేరళను “అనాథలు లేని రాష్ట్రం”గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. నిరుపేదలు, అనాథ పిల్లలకు కుటుంబ వాతావరణం కల్పించేందుకు దత్తత ప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రోత్సహించనున్నట్లు వెల్లడించింది. సమాజంలో ప్రతి చిన్నారికి భద్రత, ప్రేమ, విద్య లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ నిర్ణయాలన్నీ మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సమగ్ర సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా భావిస్తున్నారు. రుతుక్రమ సెలవులు, ప్రసూతి సెలవులు, డేకేర్ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు మహిళల జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మహిళా సంక్షేమం, బాలల సంరక్షణ, అనాథల పునరావాసం వంటి అంశాల్లో కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమాలు విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మహిళలకు మరింత అనుకూలమైన, సమాన అవకాశాలు కలిగిన సమాజ నిర్మాణం వైపు కేరళ మరో ముందడుగు వేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
