రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతోందని భావించిన తెలంగాణ సర్కారు నూతన రెవెన్యూ చట్టాన్ని ఇటీవల తీసుకొచ్చింది. దీనికి శాసనసభ ఇటీవల ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండానే సభ్యులు ఓకే అన్నారు. ఈరోజు శాసన మండలిలో ఇదే రెవెన్యూ బిల్లును కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనతో ఇక తెలంగాణలో లంచాలు ఇచ్చే బాధ తప్పుతుందని అన్నారు.
Also Read : తెలంగాణలో భూస్వాములు లేరట..?
ఈ ప్రక్రియతో ఇకపై రెవెన్యూ శాఖలో అవినీతికి ఆస్కారం ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ధరణి పోర్టల్లో మార్పులకు తహశీల్దార్లకు అధికారం లేదని వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారం కూడా లేదని స్పష్టం చేశారు. ‘పది నిమిషాల్లో రిజిస్ర్టేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ధరణి పోర్టల్లో అప్డేట్ కాగానే రిజిస్ర్టేషన్, మ్యుటేషన్, అప్డేషన్ కాపీలు వస్తాయి. రెవెన్యూ కోర్టులు కూడా రద్దు చేశాం. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చు. కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదు’ అంటూ చెప్పారు.
అంతేకాకుండా బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫొటోతోనే రిజిస్ర్టేషన్ ప్రక్రియ నడుస్తుందని కేసీఆర్ అన్నారు.. ఈ వివరాలు లేకుండా తహసీల్దార్లకు ధరణి పోర్టల్ కూడా తెరుచుకోదని అన్నారు. పకడ్బందీ వ్యూహంతో పేద రైతుల హక్కులు కాపాడుతామని, రైతులకు, ప్రజలకు లంచాలు ఇచ్చే బాధ తప్పించేందుకే ఈ నిర్ణయం చేశామని వెల్లడించారు.
ఈ బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారు. ఒకేసారి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ కూడా జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇకపై తహశీల్దారులే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది.