
ఒక ఆఫీసు ఉంటుంది. అందులో ఓ 10 మంది పనిచేస్తుంటారు. కీన్ గా అబ్జర్వు చేస్తే.. అందులోని ఒకరిద్దరి మీద ఒంటికాలిపై లేస్తుంటాడు బాసు గాడు. వాళ్లు పొరపాటు చేస్తే తప్పుగా చూపుతాడు.. తప్పు చేస్తే బ్లండర్ అని ఊగిపోతాడు. అసలు పొరపాటే చేయకపోతే రంధ్రాణ్వేషణ చేస్తాడు.
ఆ 10 మందిలోనే ఒకరిద్దరి జోలికి చచ్చినా వెళ్లడు. వాళ్లు తప్పు చేస్తే.. ‘ఏంటబ్బా ఇదీ..’ అంటూ దీర్ఘం తీస్తాడు తప్ప, అంతకు మించి ముందుకెళ్లడు. ఒక వేళ వెళ్లినట్టు చేసినా.. వెంటనే తగ్గిపోతాడు. ఎందుకంటే.. ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని నేనేమన్నా అంటే.. వాడికి దొరికినప్పుడు గూటం దించుతాడని భయం. అందుకే వాళ్ల తెరువు పోడు.
ఇక, ఇలాంటి వాళ్లే మరో ఇద్దరు ఉంటారు. వాళ్లపని వాళ్లుచూసుకొని పోతారు. ఒకరకంగా మిస్టర్ పర్ఫెక్ట్స్. వీళ్లు ఎవడికీ లొంగరు.. వొంగరు. వాళ్లు ఎవ్వల్నీ కామెంట్ చేయరు. తమను గెలికితే మాత్రం.. కింద నుంచి దించితే గొంతులోకి వెళ్తుందన్నమాట. కాబట్టి.. వాళ్లను కూడా ఏమీ అనలేడు.
ఇక మరో ఇద్దరు ఉంటారు. వాళ్లు మనోడి ఫ్రెండ్స్.. అంటే చెడ్డీ దోస్తులు అనుకునేరు! దావత్ బ్యాచ్ అన్నమాట. వీళ్లకు పెద్దగా పనిరాదు. అందుకే బాస్ గానిది ఎన్ని కేజీలు పెరిగిందో జోకుతూ.. గంటకోసారి రిపోర్ట్ ఇస్తా ఉంటరు. మోకాళ్ల కింద మెత్తటి గుడ్డవేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటరు. కాబట్టి.. వీళ్లను కూడా ఏమీ అనలేడు. అంతేకాదు.. బ్లండర్ చేసినా.. దాన్ని చర్చలోకి రాకుండా జాగ్రత్త పడ్తడు.
ఇంకో ఇద్దరు హైకమాండ్ రికమండేషన్ ఫోర్స్ ఉంటారు. వాళ్లను కదిలిస్తే.. ఎక్కడ తుపాకీ నావైపు తిరుగుద్దోనని కళ్లు పిండికుంటూ ఉంటాడు. అటు అరవలేడు.. ఇటు భరించలేడు.. సామిరంగ పిసుక్కుంటా ఉంటడు.
మరి, ఈ ఎనిమిది మంది వల్ల వచ్చే ఫ్రస్టేషన్ మొత్తం ఏదో ఒకవైపు నుంచి పోవాలె. లేకపోతే.. కొడుకు పేలిపోతడు. అందుకే.. క్యాబిన్లోంచి ‘వర్కింగ్ బే’ వైపు చూస్తే.. ఆ మూలకోటి, ఈ మూలకోటి రెండు గొర్రెలు కనపడతా ఉంటై. ఇగ వాళ్లకు ఉంటుంది నాయనా.. ఈ ఎనిమిది మందిది కలిపి.. దానికి వడ్డీ యాడ్ చేసి మొత్తం వాళ్లపై కుమ్మరిస్తడు.
పాపం.. వాళ్లకేమీ అర్థం కాదు. నేను చేసింది చిన్నపాటి పొరపాటైతే.. సంస్థకు వంద కోట్ల నష్టం చేసినట్టు ఎందుకు తిడుతున్నాడ్రా వీడు అని ఆలోచిస్తరు. మదన పడ్తరు. ఫ్రెండ్స్ తో బాధ వెళ్లగక్కుకుంటరు. చివరికి కొందరు ఏడుస్తరు కూడా. ఈ పోస్టు ఇలాంటి వాళ్ల కోసమే.
హ్యూమన్ సైకాలజీ ప్రకారం.. ఒక దానిమీద మొదట మనం ఎలాంటి భావనను ఏర్పరచుకుంటామో.. దాదాపుగా అదే కంటిన్యూ అవుతుంది. మనలో వందకు ఓ పదిమందిని మాత్రమే పాము కరిచి ఉంటుంది. మరి, అందరికీ ఎందుకు భయం? అంటే.. అది విషపూరితం అని మనకు నేర్పారు. అది కరిస్తే చస్తామని మన మనసులో ఆ భావాన్ని రిజిస్టర్ చేసుకున్నాం. అందుకే.. చచ్చిన పామును పట్టుకోవాలంటే కూడా ఉచ్చ పడుతుంది చాలా మందికి. కానీ.. కుందేలును మాత్రం చెవులు పట్టి పిండేస్తుంటారు.
సో.. నువ్వు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తనే నువ్వు ఎలాంటి వాడివో చెబుతుంటాయి. వాటి ద్వారానే అవతలి వాడు ఒక అంచనాకు వచ్చేస్తాడు. దాన్ని బట్టే నీతో వాడి బిహేవియర్ ఉంటుంది. కాబట్టి నువ్వు కుందేలుగా మాత్రం ఉండకు.. చెవులు పిండేస్తారు. పాములా విషాన్ని చిమ్మకు గానీ.. దగ్గరికొస్తే బిడ్డ ఖతమేరోయ్ అన్నట్టు బుసకొట్టు చాలు. సింహంలా మెడపట్టి కొరకొద్దులే గానీ.. కొడకా గెలికితే మాత్రం ఛస్తవ్ రరేయ్ అన్నట్టు గాండ్రించు. అప్పుడు ప్రతివాడు అంటాడు.. ‘వాడి జోలికి పోవొద్దురోయ్’ అని.