నాలుగు రోజులు సినిమాలు చేయడం.. వచ్చిన డబ్బులతో పార్టీ కార్యక్రమాలు చేపట్టడం.. మళ్లీ డబ్బులు అయిపోగానే మళ్లీ వచ్చి సినిమాలు చేయడం.. ఇదీ జనసేన అధినేత పవన్కల్యాణ్ జీవన చక్రం. 2019 ఎన్నికల్లో పోటీచేసిన పవర్స్టార్.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కనీసం ఆయన పోటీ చేసిన స్థానంలోనూ ఆయన గెలవలేకపోయారు. దీంతో కొద్ది రోజులపాటు రాజకీయాలను పక్కన పెట్టిన ఆయన మళ్లీ సినీ ఇండస్ర్టీకి వచ్చారు. ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోయారు. తాజాగా మరో వార్త వినిపిస్తోంది.
Also Read: హైకోర్టు మీ ఇష్టం అనేసినా… జగన్ మాకొద్దు అన్నాడు
దసరా నుంచి మళ్లీ జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకోవాలని నిర్ణయించారంట. ఇందుకు కార్యాచరణ సిద్ధమైందని.. పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతేకాదు ఇకపై పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఆయన కృషి చేస్తారట. పార్లమెంట్ నియోజకవర్గాల్ని కేంద్రాలుగా చేసుకొని పార్టీ ఆఫీసులు కూడా తెరుస్తారట. ప్రతి ఆఫీస్ లో అవసరమైన సిబ్బందితో పాటు సోషల్ మీడియా ఇన్చార్జులను నియమిస్తారట.
వాస్తవానికి ఎన్నికల ప్రాసెస్ ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన పదిహేను నెలలు గడిచిపోయింది. వెంటనే జనాల్లోకి రావాలనుకున్నారు పవన్. కానీ అప్పట్లో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాబు నుంచి విడిపోయి బీజేపీతో పవన్ జతకట్టారని అంటుంటారు. జనసేన–-బీజేపీ కలిసిన వెంటనే ఈ రెండు పార్టీలు సంయుక్తంగా ప్రజల్లోకి వెళ్లాయని అంతా అనుకున్నారు. కానీ అప్పట్లో బాబు మనిషి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండడం.. కరోనా తదితర పరిస్థితుల వల్ల పవన్కు అవకాశం చిక్కలేదు.
ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నరకు పవన్కు ఆ అవకాశం రానే వచ్చింది. సోము వీర్రాజు రాకతో పవన్ తన ప్రణాళికను మరోసారి బయటకు తీశారు. జనం మధ్యలోకి వెళ్లి పొలిటికల్ మైలేజీ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఇప్పుడు పవన్ జనాల్లోకి ఏం ఉపన్యాసం ఇస్తారు. ఎన్నికల సమయంలో పూర్తిగా జగన్ను తిట్టడంలోనే తన ప్రచారం కొనసాగించారు. చంద్రబాబును ఏ కోషాన కూడా ఒక్క మాట కూడా అనలేదు. మరి ఇప్పుడు ఆయన ఏ పంథాలో వెళ్తారో చూడాలి. అదే కనుక జరిగితే జనాల మధ్య, జనాల చేత ఆయన ఛీత్కారాలు ఎదుర్కోవడం మినహా మరే ఉపయోగం ఉండదు.
Also Read: ఏపీ నెంబర్ వన్ సరే… ఘనత బాబు దా? జగన్ దా?
ఇంతకుముందే చెప్పుకున్నట్టు చంద్రబాబును ఇప్పటివరకు పల్లెత్తు మాట అనని పవన్ కల్యాణ్.. ఇప్పుడు బాబును విమర్శిస్తారా, లేక సైలెంట్గా ఉంటారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు, బాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కూడా బాబును ఇప్పుడు చెడుగుడు ఆడాల్సిందే. ఆ ముచ్చట తీరుతుందా లేదా అనేది చూడాలి.