ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై వరుస దాడులు ఎంత హైరానా సృష్టించాయో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు ఎంతగానో లొల్లి చేశాయి. ప్రజల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అటు.. దేవాలయాలపై దాడులు, కనకదుర్గ ఆలయంలో అపహరణలు, అంతర్వేది రథం దగ్ధంవంటి ఘటనలు వివాదం రాజేశాయి. మరోవైపు తిరుమలలో డిక్లరేషన్ వివాదం కూడా తెరమీదికి వచ్చింది. అయితే..రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా అక్కడి సీఎం జగన్ మాత్రం ఏమాత్రం స్పందించలేదు. మౌనంగా ఉండిపోయారు. దీనిపై వైసీపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. తమ అధినేత ఎందుకు ఇలా చేస్తున్నారని ఆలోచనలో పడిపోయారట.
Also Read: విశాఖ మెట్రో ప్రారంభం..
వీటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు ఇబ్బందులు పడ్డారట. ఎక్కడికి వెళ్లినా.. మీడియా ప్రశ్నలు సంధించింది. అదే సమయంలో నియోజకవర్గంలోనూ నిలదీతలు పెరిగాయి. దీంతో జగన్ వ్యవహారంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఇప్పుడు తిరుమల శ్రీవారి విషయంలో స్వామికి భక్తులు కానుకగా ఇచ్చిన వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణంగా తీసుకునేందుకు లేదా బ్యాంకుల ద్వారా శ్రీవారి నిధులను చూపించి.. పరోక్షంగా రుణాలు పొందేందుకు పావులు కదుపుతున్న వ్యవహారం మరింత దుమారం రేగుతోంది.
జగన్ వ్యవహారంపై ఎక్కడికక్కడ నేతల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. ఈ పరిస్థితి ఒక్క నేతలకేనా? అంటే.. కాదని అంటున్నారు పరిశీలకులు. సీఎం జగన్ను వెనుకేసుకొచ్చిన, ఆయనకు గురువుగా మారి సలహాలు, సూచనలు చేసిన, జగన్ సీఎం అయ్యేందుకు యాగాలు చేసిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర వంటి సన్యాసులకు కూడా ఈ పరిణామాలు, జగన్ వ్యవహార శైలి తీవ్ర ఇబ్బందిగా మారాయనే టాక్ వినిపిస్తోంది. ‘స్వామీ మీ శిష్యుడు తిరుమల సొమ్మును ఖజానాకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు’ అంటూ ఓ భక్తుడు ఇటీవల లేఖ రాశాడు.
Also Read: వైసీపీ ఎమ్మెల్యేను మోసం చేసిన విత్తనాల కంపెనీ.. ఏం జరిగిందంటే..?
దీనిపై అటు హిందూ వర్గాల నుంచి కూడా ప్రశ్నల వర్షం కురుస్తోంది. జగన్ వ్యవహారంపై ఎటు మాట్లాడినా..తనకు తలనొప్పేనని స్వామి భావిస్తున్నారట. ‘మన దగ్గర దణ్నాలు పెడతాడు. దీంతో మనమే.. ఆయనను నడిపిస్తున్నట్టు అందరూ అనుకుంటారు. మనకెందుకు ఈ తలనొప్పి!’ అని స్వామికి అత్యంత సన్నిహితంగా ఉండే మరో స్వామి వ్యాఖ్యానించినట్టు పీఠం వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జగన్ వ్యవహారం ఇప్పుడు నేతలకే కాకుండా.. అటు స్వామిజీలకూ తలనొప్పులు తెచ్చిపెట్టింది.