Jagan- Visakha Steel: ఏపీ సీఎం జగన్ కు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఇది వెనుకబాటు ప్రాంతం.. విశాఖ రాజధాని ఏర్పాటుచేయడంతో ఉత్తరాంధ్ర సమూలంగా అభివృద్ధి చెందుతుందని ఎంత నమ్మించినా ఇక్కడి ప్రజలు పెద్దగా విశ్వసించడం లేదు. పైగా అనుమానం పెంచుకుంటున్నారు. ప్రతికూలతను ప్రదర్శించారు. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి సవాలే విసిరారు. మాకు రాజధాని వద్దు.. మీ ప్రభుత్వ పాలనపై లోపాలు, అపోహలున్నాయంటూ విద్యాధికులు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థికి దారుణంగా ఓడించారు. అయితే ఈ విషయం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వచ్చిన తరువాత కానీ వైసీపీనేతల బుర్రకెక్కలేదు. అయితే ఆ ఓటమి మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యవహారం అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
126 మంది ఎంపీల సంతకాలని హడావుడి..
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ స్టీల్ కు మద్దతుగా నగరంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. 126 మంది ఎంపీలతో విశాఖకు అనుకూలంగా సంతకాలు సేకరించి కేంద్రానికి పంపుతున్న లేఖ ఇదేనంటూ నాడు ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా చూపించారు. తాము ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు కలరింగ్ ఇచ్చారు. ప్రజలు కూడా కొంతవరకూ నమ్మారు. వైసీపీకి మద్దతు తెలిపారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే ఫార్ములాను అనుసరించారు. నాటి 126 మంది ఎంపీల సంతకాల కథనే చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు నమ్మలేదు. ఓటుతో గట్టి సమాధానమే ఇచ్చారు.
ఎట్టకేలకు జగన్ ఎంటర్..
అయితే ఓటమి నుంచి గుణపాఠాలు ఒక వైపు.. తెలంగాణ సర్కారు మరోవైపు పొంచి ఉండి హెచ్చరికలు పంపడంతో జగన్ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం చేయక తప్పని అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఈ విషయంలో జగన్ పై చాలారకాలుగా అనుమానాలున్నాయి. ఎందుకంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రంగా ఒక్కసారిగా రాజకీయంగా వేడి పెరిగిపోతోంది. రెండురోజులుగా తెలంగాణా నుండి సింగరేణి కాలరీస్ డైరెక్టర్లు నిపుణుల బృందం స్టీల్ ఫ్యాక్టరీలో భేటీలు అవుతుండటమే వేడి పెరగడానికి కారణం. స్టీల్ ఫ్యాక్టరి వేలంపాటలో తెలంగాణా ప్రభుత్వం పాల్గొని సొంతం చేసుకునేందుకు బిడ్లు వేయబోతోందనే ప్రచారం ఊపందుకుంటుంది. దీంతో కేసీఆర్ పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది.
అఖిలపక్షం ఇప్పుడు గుర్తుకొచ్చిందా?
తొలుత ఏపీ తరుపున సలహదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. కేంద్రాన్ని డిమాండ్ చేయలేం.. వినతులిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో దీనిపై ముప్పేట దాడి ప్రారంభమైంది. దీంతో అర్జెంట్ గా జగన్ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. న్నతాధికారులు సీనియర్ మంత్రులను పిలిచి చర్చించాల్సి వచ్చింది. వీలైనంత తొందరలోనే నరేంద్రమోడీకి కలవాలని జగన్ డిసైడ్ చేశారట. ముందు ఉద్యోగులు కార్మిక సంఘాల నేతలను తర్వాత అవసరమైతే అఖిలపక్ష నేతలను తీసుకుని మోడీని కలవాలని సమావేశంలో డిసైడ్ అయ్యిందట.అయితే ఈ ప్రయత్నామేదో ముందుగా చేసి ఉంటే వర్కవుట్ అయ్యేది అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఏంచేయలేరని.. ఒకసారి ప్రైవేటీకరించాలని డిసైడ్ అయిన తర్వాత రాష్ట్రప్రభుత్వం ఎంత ప్రయత్నాలు చేసినా ఆగదన్న వాదన వవినిపిస్తోంది. అందుకే జగన్ విన్నపాలను మోదీ ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటారనేది చూడాలి మరీ.