Jagan Vs Chandrababu: మూలికే నక్కపై తాటి పండు అడ్డ చందంగా మారింది చంద్రబాబు పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయన గత 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. న్యాయస్థానాల్లో ఆయనకు ఊరట దక్కడం లేదు. ఈ తరుణంలో వైసీపీ సర్కార్ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా సిఐడి మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో మద్యం కంపెనీలకు అనుమతుల విషయంలో అవకతవకల చోటు చేసుకున్నాయని చెబుతూ ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది.
టిడిపి ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరాకు సంబంధించి డిస్టలరీలకు అనుమతులలో భారీగా అవకతవకలు జరిగాయని సిఐడి చెబుతోంది.ఈ కేసులో చంద్రబాబు ఏ 3గా చూపుతోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడుపుతోంది. అయితే మద్యం బ్రాండ్ల విషయంలో గత మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతోంది. అయితే అవన్నీ చంద్రబాబు హయాంలో అనుమతించిన మద్యం బ్రాండ్ లేనని వైసీపీ రిప్లై ఇస్తోంది. ఈ నేపథ్యంలో అప్పటి మద్యం కంపెనీల అనుమతులపై ఇప్పుడు సిఐడి గురిపెట్టడం విశేషం.
అప్పట్లో మద్యం కంపెనీలకు అనుమతుల విషయంలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు సిఐడి ఆరోపిస్తోంది. అప్పట్లో ఇచ్చిన అనుమతులు వల్ల ప్రభుత్వానికి దక్కాల్సిన పనులకు కూడా కన్నం పడిందని.. డిస్టలరీలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చి భారీ అవినీతికి తెరతీసారన్నది చంద్రబాబుపై ఆరోపణ. ఈ నేపథ్యంలో ఏపీ సిఐడి కేసును నమోదు చేసి కోర్టుకు నివేదించింది. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే చంద్రబాబు జైల్లో గడుపుతున్నారు. ఇప్పుడు ప్రివెన్న్స్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ తాజా కేసు నమోదు కావడం విశేషం.
ఎన్నికల ముంగిట ఈమధ్యం కేసును బయటకు తీయడం జగన్ సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే మద్యం పాలసీతో జగన్ సర్కార్ పై చాలా రకాల విమర్శలు ఉన్నాయి. నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్యం పాలసీలో తప్పిదాలపై ప్రజల నుంచి సైతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆ మద్యం బ్రాండ్లకు చంద్రబాబు అనుమతి ఇచ్చారని.. వాటితో తమకు సంబంధం లేదని చెప్పుకునేందుకే.. కొత్తగా ఈ మద్యం కేసు తెరపైకి తెచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.