
తెలంగాణలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 59 మందికి కరోన పాజిటివ్ అని తేలింది. అందులో ఒకరు కోలుకొని ఇంటికి వెళ్లగా 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నామన్నారు.హోం క్వారంటైన్తో పాటు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో సుమారు 25వేల మంది పర్యవేక్షణలో ఉన్నారని సీఎం తెలిపారు.కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కి ప్రజలు సహకరిస్తున్నారు… మరింత సహకారం కావాలిని కేసీఆర్ అన్నారు.
ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ కి సహకరిస్తోన్న ప్రజలకు సీఎం ధన్యవాదాలు చెప్పారు.”రాష్ట్రంలో లాక్ డౌన్ చేయకుండా ఉంటే భయంకర పరిస్థితులుండేవి. మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడాను.. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఐసోలేషన్ వార్డుల్లో 11వేల మందికి చికిత్స అందే ఏర్పాట్లు చేశాము. 1400 ఐసీయూ బెడ్స్ సిద్ధం చేస్తున్నాము. 60వేల మందికి వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. రిటైర్ అయిన వైద్యులు, మెడికల్ సిబ్బందిని వినియోగించుకుంటాం. యుద్ధం చేసే సమయంలో నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. వైద్యులు, అధికారులు, పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాలి’ అని కేసీఆర్ అన్నారు.
నిత్యావసరాలు, కూరగాయల కోసం ఇంటి నుంచి ఒక్కరే వెళ్లాలి. ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ఆహార వసతి కల్పించి.. వైద్య సేవలు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాము. నిరాశ్రయులకు ఆహార వసతి కల్పిస్తాం. పశుగ్రాసం రవాణా చేసే వాహనాలకు అనుమతి ఉంది. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనేది అవాస్తవం” అని కేసీఆర్ అన్నారు.