India Birth Rate Decline: భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా కలిగిన దేశం.. యువతే మన బలం. ఇప్పటికీ యూతే మన పవర్, ఎంపవర్.. అయితే ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీర్ఘకాలిక జనాభా భారత భవిష్యత్తు గురించి కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ప్రపంచ కుబేరుడు, బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇటీవల ట్వీట్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశం చేశాయి.
పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు..
టోటల్ ఫెర్టిలిటీ రేటు అంటే ఒక మహిళ జీవితకాలంలో సగటున ఎంత మంది పిల్లలు కనగలదో సూచించే సంఖ్య. జనాభా స్థిరంగా ఉండాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలి. ఇటీవలి డేటా ప్రకారం భారత్ టోటల్ ఫెర్టిలిటీ రేటు దశాబ్దంలో 2.3 నుంచి 1.9కి పడిపోయింది. ఇది మొదటిసారి రీప్లేస్మెంట్ లెవల్ కంటే తక్కువకు దిగజారిన సందర్భం. విద్యావంతుల్లో బర్త్ రేటు చాలా కాలం క్రితమే పడిపోయింది. మస్క్ ప్రధానంగా హైలైట్ చేసిన అంశం ఇది. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆధునిక జీవనశైలి కారణంగా చదువుకున్న వర్గాల్లో జననాలు చాలా సంవత్సరాల క్రితమే తగ్గిపోయాయి. ఇది సమాజంలోని ఆర్థికంగా ముందున్న, నగరాల్లో నివసించే వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది.
దీర్ఘకాలిక ప్రభావం..
విద్య, సామాజిక ఎదుగుదల సానుకూలమైనప్పటికీ, ఇది జనాభా నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. జాతీయ స్థాయిలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.9గా ఉన్నప్పటికీ, దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంకా తక్కువ స్థాయిలో ఉంది. ఈ రాష్ట్రాల డేటా చార్ట్లో స్పష్టంగా కనిపించడం గమనార్హం. దక్షిణ భారతదేశం ఇప్పటికే జనాభా స్థిరీకరణ వైపు వేగంగా ముందుకు వెళ్తోంది. ఇది విద్య, ఆరోగ్యం, మహిళల సాధికారతలో సాధించిన పురోగతిని ప్రతిబింబిస్తుంది కానీ, భవిష్యత్తులో యువత లభ్యత, ఉద్యోగ శక్తి మీద ప్రభావం చూపవచ్చు.
పతనానికి ప్రధాన కారణాలు..
టోటల్ ఫెర్టిలిటీ రేటు పడిపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు చెబుతున్నారు. అందులో ప్రధానమైనవి మహిళల విద్యా స్థాయి పెరగడం, వృత్తి అవకాశాలు పెరగడమే. మరో కారణం ఆలస్యంగా వివాహం, పిల్లలను కనడం. నగరీకరణ, ఆర్థిక ఒత్తిడి, జీవన వ్యయం పెరగడం కూడా పతనానికి మరో కారణం. కుటుంబ నియంత్రణ సాధనాలు, అవగాహన పెరగడం ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతోంది.
భవిష్యత్పై ప్రభావం..
ఇప్పటికీ భారత్ యువ జనాభా కలిగిన దేశమే అయినా, కొన్ని దశాబ్దాల్లో వృద్ధాప్య జనాభా పెరగడం, డిపెండెన్సీ రేషియో పెరగడం, కార్మిక శక్తి తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతాయి. ఆర్థిక వృద్ధి, పెన్షన్ వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మస్క్ ఆందోళన చెందుతున్నట్లుగా, తక్కువ జననాలు దీర్ఘకాలికంగా సమాజాలను బలహీనపరుస్తాయి.
పరిష్కారం ఏమిటి..
జననాలను బలవంతంగా పెంచడం కాకుండా, సమతుల్య విధానాలు అవసరం. మహిళలకు మద్దతు (చైల్డ్కేర్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్)
యువతకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం ఉండాలి. ఆరోగ్యకరమైన వలస విధానాలు, జనాభా మార్పులకు అనుగుణంగా విద్య, సాంకేతికత, ఆటోమేషన్పై దృష్టి పెట్టాలి.
భారత్ ఇప్పటికే డెమోగ్రాఫిక్ డివిడెండ్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. ఇప్పుడు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ తర్వాతి దశకు సిద్ధమవ్వాల్సిన సమయం ఇది. మస్క్ ట్వీట్ కేవలం హెచ్చరిక మాత్రమే కాదు.. భవిష్యత్తు గురించి సకాలంలో ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.
