Modi Amit Shah political strategy: భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను కేవలం రొటీన్ సవరణగా చూడకూడదు. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన అక్రమాలు, డూప్లికేట్ ఎంట్రీలు, మరణించిన ఓటర్ల పేర్లు, అక్రమ వలసదారుల ప్రవేశం వంటి సమస్యలకు వ్యవస్థాగత పరిష్కారం కోసం చేపట్టిన సమర్థవంతమైన చర్య. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలోని ప్రభుత్వం డేటా–ఆధారిత సంస్కరణల ద్వారా ఓటర్ జాబితాలను శుద్ధి చేస్తుండగా, ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నాయి. సర్పై కోర్టులను ఆశ్రయించాయి. కానీ సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది.. ఇది ఎన్నికల సంఘం యొక్క చట్టబద్ధమైన బాధ్యత.
సుప్రీం కోర్టు స్పష్టీకరణ..
2026లో సుప్రీం కోర్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ ఎన్నికల సంఘంపై వేసిన కేసులో ఎస్ఐఆర్ను సమర్థించింది. ఆర్టికల్ 324, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 21(3)
కింద ఎన్నికల సంఘానికి ఓటర్ జాబితాల సమగ్ర సవరణ చేపట్టే అధికారం ఉందని తీర్పు ఇచ్చింది. విదేశీయుల గుర్తింపు విషయంలో పరిమిత పరిశీలన మాత్రమే చేయాలని, పూర్తి పౌరసత్వ నిర్ణయం కాదని స్పష్టం చేసింది. ఫారినర్స్ చట్టం ప్రకారం కాంపిటెంట్ అథారిటీ(హోం మంత్రిత్వ శాఖ) బాధ్యతను కోర్టు గుర్తించింది. దీంతో బంతిని హోం మంత్రిత్వ శాఖ వైపు మళ్లించడంతో ప్రతిపక్షాల వ్యూహం మారింది.
డేటా ప్రక్షాళణ..
ప్రభుత్వం వివిధ వనరుల నుంచి డేటాను క్రోడీకరిస్తోంది. ఆధార్ శుద్ధీకరణ చేసి మరణించిన 2.5 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేశారు (2026 ఫిబ్రవరి నాటికి). ఇది మునుపటి 14 సంవత్సరాల కంటే ఎక్కువ. కొత్త ఆధార్ జారీని కఠినమైన పర్యవేక్షణలోకి తెచ్చారు. ఇక ముంబైలోనే 87,000కి పైగా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఇవి అక్రమ వలసదారులకు ఇవ్వబడినట్టు ఆరోపణలు. దేశవ్యాప్తంగా ఇలాంటి శుద్ధీకరణ జరుగుతోంది. రేషన్ కార్డులు, ఇతర వ్యవస్థలు బిహార్లో లక్షలాది నకిలీ కార్డులు తొలగించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డేటా, పాస్పోర్టు రికార్డులు కూడా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తయింది. మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించడం ఈ ప్రక్రియ తీవ్రతను చూపిస్తుంది.
సరిహద్దు భద్రత పటిష్టం..
హోం మంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల్లో స్మార్ట్ బార్డర్ వ్యవస్థను బలపరుస్తున్నారు. ట్రాన్స్–బార్డర్ మైగ్రేషన్ను నియంత్రించడం, లోపల ఉన్న అక్రమ నివాసులను గుర్తించడం దీని లక్ష్యం. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)తో ఎస్ఐఆర్ లింక్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా, ఇది ఓటర్ జాబితా సమగ్రత కోసమేనని ప్రభుత్వం చెబుతోంది.
ఈ సంస్కరణలు కొన్ని రాజకీయ శక్తుల ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. అక్రమ వలసలు, నకిలీ ఓటర్లు దశాబ్దాలుగా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలను మార్చాయి. కానీ ప్రజాస్వామ్యం నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. అనర్హులు ఓటు వేస్తే అర్హులైన పౌరుల హక్కు దోచుకున్నట్టే. ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతమైతే, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఓటర్ జాబితాలను కలిగి ఉంటుంది.
మొత్తానికి ప్రతిపక్షాలు ఏదో చేయాలనుకుంటే ఇంకోదే అయినట్లు.. సర్ ప్రక్రియ ఇప్పుడు అమిత్షా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ప్రతిపక్షాలు నోరు మెదపకుండా అయింది.
