
AP Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే జగన్ చర్యలుండడంతో ముందస్తు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొన్నటికి మొన్న మెజార్టీ ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్న కీలకమైన పట్టభద్రుల స్థానాలను చేజార్చుకుంది. అటు పార్టీ ఎమ్మెల్యేలు కట్టుదాటి మరీ విపక్ష టీడీపీ అభ్యర్థికి ఓటువేశారు. పట్టభద్రుల రూపంలో ప్రజా వ్యతిరేకత, ఇటు ఎమ్మెల్యేల రూపంలో ఎదురైన ప్రతికూల అంశాన్ని జగన్ సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇక ఏ మాత్రం ఉపేక్షించినా అసలుకే ఎసరు వస్తుందని తెలిసి ముందస్తుకు సిద్ధపడుతున్నారని ప్రచారం సాగుతోంది. జగన్ ఢిల్లీ టూర్లు, ఇతర పథకాల ప్రారంభం చేసే సమయంలో ముందస్తు తప్పదని పార్టీ శ్రేణులకు చంద్రబాబు హెచ్చరించేవారు. కానీ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. తాజాగా బుధవారం జగన్ ఢిల్లీ పయనమవుతుండడంతో మరోసారి చంద్రబాబు పార్టీ శ్రేణులకు అలెర్ట్ చేస్తున్నారు.
విపక్షాల ఐక్యత గట్టి పడకుండా..
ఇప్పుడు జగన్ ముందు ఉన్నది ఒకటే వ్యూహం. విపక్షాల ఐక్యతకు ఏ మాత్రం సమయం ఇవ్వకూడదని భావిస్తున్నారు. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడమే వైసీపీ అభ్యర్థుల ఓటమికి కారణమని జగన్ భావిస్తున్నారు. అధికార పార్టీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉంటుంది. అయితే రోజులు గడిచే కొద్దీ అది తీవ్రమవుతుందని.. విపక్షాల మధ్య స్నేహం చిగురించడంతో పాటు బలం పెరుగుతుందని.. అది తనకు తీరని నష్టం చేకూరుస్తుందని జగన్ ఆందోళనతో ఉన్నారు. అందుకనే ముందస్తు ఎన్నికలకు వెళితే సరిపోతుందని ఆలోచన మొదలైనట్లు సమాచారం. టీడీపీ జనసేన అధికారికంగా పొత్తుపెట్టుకుంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీళ్ళతో వామపక్షాలు కలిసే అవకాశముంది. అప్పుడు ప్రతిపక్షాల బలం పెరుగుతుంది. అందుకనే ప్రతిపక్షాలు కలవకుండా దెబ్బ కొట్టాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళటమే ఏకైక మార్గమని జగన్ అనుకుంటున్నారట. ప్రధానంగా బీజేపీ సహకారంతోనే గట్టెక్కాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వామపక్షాల ఎంట్రీతో కలవరం..
టీడీపీ,జనసేన వైపు బీజేపీ కలవకూడదని జగన్ భావించారు. కానీ ఇప్పుడు వామపక్షాలు ఆ రెండు పార్టీల బాట పడుతుండడం జగన్ ను కలవరపరుస్తోంది. లెఫ్ట్ పార్టీలకు ప్రజాసంఘాల మద్దతు పుష్కలంగా ఉంటుంది. ఇప్పటికే వారు రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఆగ్రహంగా ఉన్నారు. వారి బలం కానీ కూటమికి తోడైతే తనకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అందుకే కేంద్ర పెద్దలను కలవనున్నారు. రెండు వారాల్లో రెండుసార్లు పెద్దలను కలుస్తుండడంతో ముందస్తు ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. వామపక్షాలు చంద్రబాబు వద్దకు చేరుతుండడాన్ని జగన్ బీజేపీ పెద్దలతో ప్రస్తావించనున్నట్టు సమాచారం. మీతో పొత్తుకు వెంపర్లాడుతునే అధికారం కోసం వామపక్షాల సాయం తీసుకున్న విషయం ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీ పెద్దలకు ఏంచెబుతారు?
అయితే బీజేపీతో జగన్ ఎటువంటి ఒప్పందం చేసుకుంటారన్న దానిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నేరుగా పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశముంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి జనసేన, టీడీపీ కూటమి ఆప్షన్ గా ఉంది. ఇప్పుడు ఎటువంటి ఆప్షన్ లేనిది వైసీపీకి మాత్రమే. అటు పవన్ సైతం బీజేపీ విషయంలో వేర్వేరు ఆలోచనలతో ఉన్నారు. చంద్రబాబు చూస్తే బీజేపీ రాకున్నా వామపక్షాలను కలుపుకొని వెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి ఎలా జగన్ ఒప్పిస్తారన్నది ప్రశ్న. సీట్లు ఇవ్వజూపుతారా? లేకుంటే ఎన్నికల తరువాత సపోర్టు చేస్తానని హామీ ఇస్తారా? ఇస్తే బీజేపీ నమ్ముతుందా? అన్నవి చిక్కుముడి ప్రశ్నలు. కానీ జగన్ మాత్రం తెలంగాణతో పాటు నవంబరులో ఎన్నికలకు వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నారు. అయితే బీజేపీ పెద్దలు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి మరీ.