ఎన్నో సవాళ్లు.. మరెన్నో సమస్యలు.. ఇంకెన్నో ప్రశ్నలు.. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఈ సర్వేదో ఎంత వరకు సమగ్రం..? దీనిపై అందరికీ అనుమానాలే ఉన్నాయి. కానీ.. తీర్చే వారు లేరు. ప్రభుత్వం కూడా ముందస్తుగా ఎలాంటి పరిశీలనలు లేకుండా సర్వేకు దిగింది. అందుకే పలు సమస్యలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికితోడు ప్రక్రియ చివరి దశలో ఉండగా ప్రభుత్వం ఇప్పుడు మేల్కొనడంపై క్షేత్ర స్థాయి సిబ్బంది పెదవి విరుస్తున్నారు. ఇన్నాళ్లూ ఇబ్బందులను వదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడెందుకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందనే దానికి కూడా సమాధానం దొరకని పరిస్థితి.
Also Read: పూల సింగిడి.. తెలంగాణలో నేడే పూల పండుగ
ఈ సర్వేలో అటు క్షేత్ర స్థాయి సిబ్బందికీ.. ఇటు ప్రజలకూ వందలాది అనుమానాలు ఉన్నాయి. అసలు ఉమ్మడి ఆస్తులను ఎలా చేరుస్తారు..? యజమానికి ఆధార్ కార్డు/రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి..? ప్రస్తుతమున్న ఆస్తుల రికార్డుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దకుండానే ధరణిలో చేరిస్తే ఎలా..? యజమాని స్థానికంగా లేకపోవడం, ఆధార్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డు కూడా లేకపోవడం, డోర్లాక్, పేరులో తప్పులు, ఉమ్మడి ఆస్తి విషయంలో ఏమి చేయాలి..? డబుల్ ఎంట్రీ జరిగితే డిలీషన్ ఆప్షన్ లేకపోవడంపై గందరగోళం నెలకొంది.
మరోవైపు మ్యూటేషన్ పూర్తికాని వాటికి పాత యజమాని పేరునే చూపిస్తోంది. కొన్ని పంచాయతీలు రెండు మండలాల పరిధిలో ఉన్నట్లుగా యాప్లో కనిపిస్తోంది. లీజు/లీజు డీడ్పై స్పష్టత లేదు. ఒకే ఇంటి నెంబరును ఇద్దరు యజమానులు ఇస్తే పాత భవనం కూల్చి కొత్తనెంబరుపై ఇల్లు నిర్మించిన వాటికి రెండు నెంబర్లు చూపిస్తే, కొత్తది ఏర్పడినా పాత పంచాయతీలోనే ఇంటి నెంబరు ఉంటే ఎలా అనే దానిపై క్లారిటీ లేదు.
Also Read: తెలంగాణ పీజీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.?
ఖాళీ స్థలాలపైనా ఎలాంటి స్పష్టత లేదు. అత్త, మామ, సోదరులు, సోదరికి సంబంధించిన బంధుత్వ వివరాల నమోదులోనూ యాప్లో ఇబ్బందులు ఉన్నాయి. ఈ-పంచాయతీ పోర్టల్లో తప్పుగా నమోదైన యజమాని, అతని తండ్రి పేరు సవరించిన తరువాత మొబైల్ యాప్లో దీనిని తీసుకోవడం లేదు. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సర్వే ఎలా పూర్తి చేస్తారు..? ఒకవేళ చేసినా దానికి నిర్దిష్టత ఉంటుందా..? ఖచ్చితమైన సమాచారాన్నే సిబ్బంది చేర్చుతున్నారా..? ఈ అనుమానాలన్నీ రాక తప్పదు.