Daggubati Venkateswara Rao: ” రాజకీయాల్లో విలువలు పడిపోయాయి.. డబ్బు ఉన్నవాడిదే రాజ్యమవుతోంది.. ఇలాంటి రాజకీయాలు నేను చేయలేను.. నేను నా కొడుకు హితేష్ కూడా ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటాం” ఇదీ ఎన్టీ రామారావు పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన ప్రకటన.. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మరి పురందశ్వరి కూడా ఇదే నిర్ణయం తీసుకుంటారా? అంటే ఈ ప్రశ్నకు కూడా అవుననే సమాధానం వస్తున్నది.. ఆమె ఇటీవల నుంచి భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కి రాజకీయ వైరాగ్యం ఇది మొదటిసారి కాదు.. లక్ష్మీపార్వతి వర్గంలో కొనసాగడం, రాజ్యసభ అభ్యర్థిగా గెలవడం, ఆ తర్వాత బిజెపిలో చేరటం చక చకా జరిగిపోయాయి. కనీసం సమావేశంలో కూడా పిలవడం లేదని ఆయన అప్పట్లో రాజీనామా చేశారు.. 1999 ఎన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. 2004 ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, భార్య పురందేశ్వరి ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు.. అప్పట్లో ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది.. ముఖ్యంగా దగ్గుబాటి కాంగ్రెస్ లో చేరటం, ఎమ్మెల్యేగా గెలవడం అప్పట్లో ఒక సంచలనం.. రాజశేఖర్ రెడ్డి దగ్గుబాటికి మంత్రి పదవి ఇస్తారని అప్పట్లో చాలా మంది భావించారు.. కానీ వైయస్సార్ ” మీ సతీమణికి కేంద్రమంత్రి పదవి ప్రయత్నం చేసుకోండి. కానీ రాష్ట్రంలో మీకు మంత్రి పదవి ఇవ్వలేనని” దగ్గుబాటికి క్లారిటీగా చెప్పారు.. 2004, 2009 లో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి, కొంత కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి 2014 ఎన్నికల ముందు విలువల పాఠాలు చెప్పి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు.. తెలుగుదేశం పార్టీ మద్దతుతో రాజంపేట ఎంపీగా పోటీ చేశారు.. ఈ సంఘటన రాజకీయాల్లో సర్దుకుపోవడం అనివార్యం అనే ఉదాహరణను మరింతగా బలపరిచింది..
2019లో దగ్గుబాటి వైసీపీలో చేరటం, ఆయన కొడుకు హితేష్ కు పర్చూరు టికెట్ రావడం మరింత ఆశ్చర్యకరం.. కొడుకు అమెరికా సిటిజన్ కావడంతో దగ్గుబాటి స్వయంగా పోటీ చేశారు. వైసీపీ 151 సీట్లు గెలిచినా.. పర్చూరు లో దగ్గుబాటి ఓడిపోవడం గమనార్హం. ఆయనకు కొత్త పాఠాలు నేర్పిందో లేదో కానీ ఆయన వర్గానికి సత్యం బోధపడింది. పోలింగ్ జరిగిన తర్వాత కూడా దగ్గుబాటి గెలుస్తారనే నమ్మకం ఆయన సన్నిహితుల్లో కూడా కలగలేదు.

పట్టించుకోలేదు
పర్చూరు లో ఓడిపోయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావును వైసీపీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు.. పార్టీ సమావేశాలకు ఆహ్వానం పలకలేదు.. పలమార్లు జగన్ అపాయింట్మెంట్ కోసం దగ్గుబాటి ప్రయత్నించినా దొరకలేదు. దీంతోపాటు ఆయన అనుచరులను సొంత పార్టీ వారే వేధిస్తున్న నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మనసు మార్చుకున్నారు.. తాను, కొడుకు రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటన చేశారు. కానీ దగ్గుబాటి ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో ఇదే తీరుగా వ్యవహరించారు. తర్వాత మనసు మార్చుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు రాజకీయ జీవితాన్ని దగ్గుబాటి అలా ముగించడని చాలా మంది అంటున్నారు. మరీ ఇదే సమయం లో పురందేశ్వరి కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తానికి దగ్గుబాటి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.