Chinese Smartphone Companies: భారత మొబైల్ మార్కెట్లో అత్యధిక వాటా చైనా కంపెనీలదే. భారత్, కొరియా, జపాన్ కంపెనీల ఫోన్లు మార్కెట్లో ఉన్నప్పటికీ ధరల విషయంలో చౌకగా ఉండడంతో భారతీయులు చైనా ఫోన్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అనేక చైనా కంపెనీ ఫోన్లు భారత్ మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. చిన్న డబ్బా ఫోన్ నుంచి ఆన్డ్రాయిడ్ ఫోన్ వరకు అత్యధిక వాటా చైనాదే. మొబైల్ మార్కెట్ను ఒక ఊపు ఊపిన చైనా కంపెనీలు క్రమంగా భారత్ను వీడుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం..
భారత్లో కార్యకలాపాల నుంచి వైదొలగుతున్న విదేశీ సంస్థల జాబితా పెరిగిపోతుంది. మార్కెట్లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక, ఇక్కడి చట్టాల్ని యేథేచ్ఛగా ఉల్లంఘించినా ఏం కాదులే అనే ధీమాతో ఇన్నాళ్లూ చైనా కంపెనీలు మొబైల్ మార్కెట్లో అత్యధిక వాటా కలిగి ఉన్నాయి. చైనా సంస్థ సరిహద్దుల్లో కవ్వింపునకు పాల్పడడం, కరోనా సమయంలో అనేక యాప్లను తమ దేశ కంపెనీ ఫోన్లలోకి పంపి నగదు కొల్లగొట్టడం, తాజాగా లోన్యాప్లతో భారతీయుల ఆదాయాన్ని దోచుకుపోతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం ఇలాంటి చీటింగ్ కంపెనీలను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. అక్రమవ్యాపారంపై ధీమా తగ్గడంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేసే సంస్థలు దేశీయ మార్కెట్కు గుడ్బై చెబుతున్నాయి. తమ వ్యాపార నిర్వహణకు అనువైన దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారత్లో తన కార్యకలాపాల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. భారత్కు గుడ్బై చెప్పి ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియాలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల్ని ప్రచురించింది.
ఈజిప్ట్లో ఒప్పో యూనిట్..
‘భారత్ దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థల్ని ప్రోత్సహించేందుకు మా పట్ల (చైనా కంపెనీలు) కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ తరహా ధోరణి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఎక్కువగా ఉంది’ అంటూ భారత్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు చెందిన ప్రతినిధులు చెప్పారని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒప్పో ఈజిప్ట్లో మ్యానిప్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఫోన్ల తయారీ ప్లాంటు కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తద్వారా రానున్న సంవత్సరాల్లో సుమారు 900 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఈజిప్ట్ ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.

పన్ను ఎగ్గొట్టిన చైనా కంపెనీలు..
2021 డిసెంబర్లో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడి చైనాలో తన పేరెంట్ కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చైనా స్మార్ట్ఫోన్ సంస్థ షావోమీతోపాటు ఇతర చైనా సంస్థల్ని విచారణ చేశారు. ఆ విచారణ కొనసాగుతుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ అధికారులు షావోమీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్జెన్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఒప్పో, వివో, షావోమీతోపాటు ఇతర కంపెనీలు మనీ ల్యాండరింగ్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో 2022, జులైలో ఈడీ అధికారులు చైనా సంస్థ వివోతోపాటు ఇతర సంస్థలకు చెందిన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మేఘాలయా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
వేల కోట్ల రూపాయల మోసం..
ఈడీ దాడుల్లో వివో మోసాలను బయటపడ్డాయి. వివో కంపెనీ భారత్లో పన్నులు ఎగొట్టి టర్నోవర్లో దాదాపు 50 శాతం నిధులను చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 2017 నుంచి 2021 మధ్య కాలంలో రూ.62,476 కోట్లు చైనా తరలినట్లు ఈడీ వెల్లడించింది. వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొట్టిన విషయం వెలుగు చూసింది. ఆ సంస్థ కూడా రూ.4,389 కోట్ల వరకు కస్టమ్ డ్యూటీ ఎగవేసిందని ఈడీ గుర్తించింది. వస్తువుల విలువను తక్కవ చేసి చూపించడం ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలిపింది. మరో కంపెనీ షావోమి కూడా రూ.653 కోట్లు ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో భారత్కు చైనా కంపెనీలు గుడ్ బై చెప్పడం ఆసక్తికరంగా మారింది.
భారత్తో పెట్టుకుంటే అట్లుంటది..
మోదీ దెబ్బకు చైనా కంపెనీల అబ్బా అంటున్నాయి. ఇన్నాళ్లూ స్థానిక అధికారుల సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో వ్యాపారం సాగించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చైనా కంపెనీల వ్యాపార లావాదేవీలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. భారత సరిహద్దుల్లో చైనా సైన్యం రెండేళ్లుగా కవ్వింపులకు పాల్పడుతోంది. కరోనా సమయంలో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. గాల్వాన్ వద్ద చైనా సైన్యాన్ని భాతర సైన్యం అడ్డుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తెలుగు సైనికుడు కల్నల సంతోషకుమార్తోపాటు 20 మంది మృతిచెందారు. దీనిని సీనియస్గా తీసుకున్న కేంద్రం.. చైనా కంపెనీల వ్యాపారంపై దృష్టి పెట్టింది. టిక్టాక్ను మొదట నిషేధించింది. తర్వాత చైనా వీడియో గేమ్స్తోపాటు, పలు లోన్ యాప్స్ను నిషేధించింది. తర్వాత చైనా మొబైల్ కంపెనీల అక్రమ వ్యాపారంపై దృష్టి పెట్టంది. కొంతమంది స్థానిక అధికారులు చైనా కంపెనీలకు సహకరిస్తున్నట్లు గుర్తించింది. వారిని తప్పించింది. తర్వాత అక్రమ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో బెంబేలెత్తిన చైనా కంపెనీలు ఇండియాను వీడుతున్నాయి.