Chaos at Messis Kolkata event: అర్జెంటీనా ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ(Argentina football player Messi) ఇటీవల భారత్ విచ్చేశారు. ఆయన కోల్కతా, హైదరాబాద్, ముంబై నగరాలలో మెస్సి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (Messi goat tour) టూర్ నిర్వహించేందుకు వచ్చారు. తన వెంట ఇంటర్మీయామి జట్టుకు చెందిన ప్లేయర్లను కూడా తీసుకొచ్చారు.
కోల్ కతా లో ఫుట్ బాల్ ఆటకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ రకరకాల క్లబ్బులు ఉన్నాయి. ఇక్కడ క్రికెట్ తో సమానంగా ఫుట్ బాల్ ఆటను ప్రజలు ఆదరిస్తుంటారు. యువకులు కూడా అత్యంత ఇష్టంగా ఫుట్బాల్ గేమ్ ఆడుతుంటారు. అయితే మెస్సీ టూర్ నిర్వహించిన సాల్ట్ లేక్ స్టేడియంలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మెస్సితో ఫోటోలు దిగడానికి తాపత్రయపడ్డారు. దీంతో ప్రేక్షకులకు మెస్సి దర్శన భాగ్యం కలగలేదు. అతని ఆట చూసే అవకాశం లభించలేదు. సుమారు గంటపాటు స్టేడియంలో ఉండాల్సిన మెస్సి.. నిర్వహణ లోపల వల్ల 22 నిమిషాలకే మైదానం నుంచి వెళ్లిపోయారు.
మెస్సి ని చూసేందుకు భారీగా డబ్బు ఖర్చుపెట్టి వచ్చినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సి అభిమానులు విధ్వంసం సృష్టించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఫలితంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా అభిమానులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం నెలకొంది. ఈ క్రమంలో ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతుండగానే పశ్చిమబెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్(Aroop Biswas) తన పదవికి రాజీనామా చేశారు.
“ఈ ఘటనపై న్యాయబద్ధంగా విచారణ జరగడానికి నేను రాజీనామా చేస్తున్నానని” బిశ్వాస్ ప్రకటించారు. మరికొద్ది నెలల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే విపరీతంగా డ్యామేజీ జరిగిన నేపథ్యంలో.. నష్ట నివారణ చర్యలలో భాగంగా క్రీడా శాఖ మంత్రితో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయించినట్టు తెలుస్తోంది. శాంతిభద్రతల విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మమత బెనర్జీ క్రీడా శాఖ మంత్రి తో రాజీనామా చేయించినంతమాత్రాన ఉపయోగముండదని.. ఆమె పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలిసిపోయిందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీనిపై మమతా బెనర్జీ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సి ఉంది.