Chandrababu- Kamma Community: ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల హంగామా మొదలైంది. అన్ని పార్టీల నేతలు ప్రజలను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. ఏపీలో ఎన్నికలను సామాజిక సమీకరణాలే ఎక్కువ ప్రభావితం చేస్తాయి. గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. 2019లో సీఎం జగన్ రికార్డు విజయానికి ఈ సామాజిక సమీకరణాలు కీలకంగా పని చేసాయి. ఇక, ఇప్పుడు సీఎం జగన్కు కమ్మ సామాజికవర్గం దూరమైందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కమ్మ వర్గం జగన్ వెంటే ఉందని గ్రామస్తులు చెప్పటం.. అందుకు కృతజ్ఞతగా డిప్యూటీ సీఎం పాదాభివందనం వైరల్ అవుతున్నాయి.

బాబు సొంత జిల్లాలో డిప్యూటీ సీఎం..
ఎప్పుడూ ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మరోసారి ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కమ్మ వర్గానికి చెందిన ఒక సీనియర్ సిటిజన్కు పాదాభివందనం చేశారు. ఈ ఆసక్తికర ఘటన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుమూరు మండలం మొరవకండ్రిగలో డిప్యూటీ సీఎం పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. వారికి అందుతున్న సంక్షేమం గురించి ఆరా తీశారు.
కమ్మల్లో మార్పు వచ్చిందంటూ..
మొరవకండ్రిగలో ఒక సీనియర్ సిటిజన్ ఫ్యామిలీ వద్దకు వెళ్లారు నారాయణ స్వామి. అక్కడ ఉన్న మహిళను మీకు డ్వాక్రా రుణ మాఫీ జరిగిందా అని ప్రశ్నించగా ఆ మహిళ అవునని సమాధానం ఇచ్చారు. పెన్షన్ వస్తుందా అంటూ వాకబు చేశారు. దీంతో, మీకా.. అక్కడే ఉన్న వ్యక్తిని చూస్తూ ఆ పెద్దాయనకా అని ప్రశ్నించారు. దీనికి స్పందనగా ఆ పెద్దాయన తనకు వస్తుందని.. తాను రైతునని పరిచయం చేసుకున్నారు. తన పేరు రాధానాయుడు అంటూ డిప్యూటీ సీఎంకు తమకు అందుతున్న పథకాల గురించి వివరించారు. సీఎం జగన్ పాలన బాగుందని..ఆయన మరోసారి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందంటూ రాధా నాయుడు చెప్పుకొచ్చారు.

డిప్యూటీ సీఎం పాదాభివందనం
జగన్ పాలన, పథకాల గురించి రైతు రాధా నాయుడు గొప్పగా చెప్పడంతో ఉబ్బి తబ్బిబ్బయిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెంటనే ఆయన పాదాలపై పడిపోయారు. దీనికి స్పందించిన రాధా నాయుడు కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరారు. కమ్మ సామాజికవర్గంలో మార్పు వచ్చిందని, ఆ వర్గం కూడా జగన్ సీఎం కావాలని కోరుకుంటుందంటూ డిప్యూటీ సీఎం పాదాభివందనం చేశారు. కమ్మ సామాజికవర్గం వైసీపీకి దూరమైందంటూ కొంత కాలంగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఆ వర్గం సీఎం జగన్కే అండగా నిలుస్తోందనే విషయం స్పష్టమవుతోందని వివరించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పాదాభివందనం వ్యవహారం చిత్తూరు జిల్లాలో వైరల్ అవుతోంది.