పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు సవాలుగానే మారనున్నాయని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రతిపక్షాలు అన్ని వ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలని అధికార పక్షం బరిలోకి దిగుతోంది. మరోవైపు ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దేశంలో నిత్యావసర ధరలు, ఇంధన ధరలు, కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, రఫేల్ యుద్ధ విమానాల్లో వివాదం, చైనాతో సరిహద్దు సమస్య వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారించనున్నాయి.
లోక్ సభలో వీటిపై ప్రస్తావించాలని విపక్షాలు గట్టిగా పట్టుపడుతున్న వేళ ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధమవుతోంది. కొత్తగా 17 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో అమలవుతున్న బిల్లులు సైతం పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ఇవి కాకుండా లోక్ సభలో నాలుగు రాజ్యసభలో మూడు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బిల్లు, స్పెషల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు, జాతీయ ఆహార టెక్నాలజీ సంస్థ బిల్లు, దేశరాజధాని ప్రాంత గాలి నాణ్యత యాజమాన్యంపై ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు విద్యుత్ చట్ట సవరణ బిల్లు, గిరిజన సంస్కరణల బిల్లు, డీఎన్ఏ టెక్నాలజీ బిల్లు, ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ బిల్లు, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు, తల్తిదండ్రులు, వృద్దుల సంక్షేమం బిల్లు, జనాభా నియంత్రణ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి తదితర బిల్లులను ఈ దఫా ప్రవేశ పెట్టనున్నారు.
వివాదాస్పద జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ప్రైవేటు బిల్లులు సైతం పార్లమెంట్ ముందుకు రానున్నట్లు సమాచారం. పలువురు బీజేపీ ఎంపీలు వీటిని సభలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉభయ సభలసెక్రెటేరియట్లు విడుదల చేసిన సమాచరాం ప్రకారం లోక్ సభలో ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సన్హా సైతం నోటీసు ఇచ్చారు. వీటిపై సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.