
‘తమ్ముడు.. తమ్ముడే.. పేకాట పేకాటే..’ అన్నట్లుగా ఉంది కేంద్రం వైఖరి. కేంద్రం తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేకుండా ఒకే చెబుతూ తలాడించిన ఏపీ సీఎం జగన్కు తాజాగా కేంద్రం ఝలక్ ఇచ్చింది. కేంద్రంలోని బీజేపీతో, ఆ పార్టీ పెద్దలతో జగన్ కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఒక దశలో ఎన్డీయేలోకి జగన్ వైసీపీ చేరబోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనలు కూడా అందుకు బలాన్నే చేకూర్చాయి.
Also Read: వైసీపీ వర్సెస్ టీడీపీ: ఏపీలో ‘బురద’ రాజకీయం!
కానీ.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం జగన్కు అశనిపాతంలా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు 2019ని కేంద్రం వెనక్కి పంపించింది. ఈ బిల్లులో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని సూచించినట్లు సమాచారం. సరిచేసి పంపాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోయినా.. బిల్లు రూపకల్పనలో కొన్ని అంశాలు ఇబ్బందిగా మారినట్లు సమాచారం. ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు చేయకుండా అమలు చేసే పరిస్థితి లేదన్నట్లు తెలుస్తోంది.
దిశ బిల్లు రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా ఐపీసీలో కొత్తగా 354ఈ, 354ఎఫ్, 354జీ సెక్షన్లను చేర్చారు. ఐపీసీలో చేసే మార్పుల ప్రకారం ఏపీకి మాత్రమే వర్తింపజేయాలి. ఈ చట్టం ప్రకారం నిందితులకు కఠిన శిక్షల కోసం ఐపీసీలో కేవలం ఏపీకే వర్తించేలా అందులో పేర్కొంది. అయితే.. ఇలా సెక్షన్లు మారిస్తే మిగతా రాష్ట్రాలు కూడా మార్పులు కోరే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మొత్తం ఐపీసీ అమలే ప్రశ్నార్థకమవుతుంది. అంతిమంగా ఐపీసీనే ప్రక్షాళన చేయాల్సి వస్తుందని నిపుణుల అభిప్రాయం. అందుకే ఈ బిల్లును తిరస్కరించారనే చర్చ జరుగుతోంది.
కేంద్రం దిశ బిల్లును వెనక్కి పంపడంతో జగన్ సర్కార్కు ఇబ్బందిగా మారింది. మరోసారి ఈ బిల్లులో తగిన సవరణలు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదిస్తే కానీ కేంద్రానికి పంపే అవకాశం ఉండదు. దీని కోసం ముసాయిదా సవరణ బిల్లును తీసుకొచ్చి అసెంబ్లీ ఆమోదం పొంది కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం ఓకే అంటేనే చట్టం అవుతుంది.. లేదంటే యథారాజా తథాప్రజ అన్నట్లే.
ఏపీ తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం.. పక్కా ఆధారాలు ఉంటే అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లోనే పూర్తిచేయాలి. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంటుంది. మొన్నటి వరకు ఈ కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుందన్నమాట. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పనిచేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతాయి. మహిళలు, చిన్నారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపైనా చర్యలు తీసుకుంటారు.
Also Read: రైతులకు కేంద్రం శుభవార్త.. సులభంగా లక్షా 60 వేల రుణం!
మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా బిల్లు రూపొందించారు. ఈ బిల్లును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ అసెంబ్లీలో ఆమోదించి.. చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్రానికి పంపించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. కానీ.. ఇంతలోనే జగన్ ప్రయత్నానికి కేంద్రం బ్రేక్ వేసినట్లైంది.
Comments are closed.