Cabinet Reshuffle In Andhra Pradesh: ఒక సీఎం, నలుగురు డిప్యూటీ సీఎంలు, 25 మంది మంత్రులు.. ముచ్చటగా మూడేళ్లు ఏలారు. మిగతా విప్ లు, చీప్ విప్ లు, కార్నోరేషన్ చైర్మన్లుగా కొనసాగేవారు. ఏ పదవి లేని మరో 100 మందికి పైగా ఎమ్మెల్యేలుగా కొనసాగేవారు. అలాగని ఇంతవరకూ పార్టీలో అసంత్రుప్తి లేదు. అధినేత మాటకు ఎదురులేదు. అయినా మంత్రివర్గం మొత్తాన్ని తప్పించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది. అనవసరంగా అగ్గితో తల గోక్కున్నట్టు ఈ నిర్ణయాలేమిటి? దీనిపై వచ్చే పర్యవసానాలేమిటి? అంటూ సగటు వైసీపీ అభిమానులు తెగ బాధపడుతున్నారట. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు.. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికే సవా లక్ష ప్రజా సమస్యలు ఏపీ నిండా ఉన్నాయి. ఒక వైపు కొత్త జిల్లాలు ప్రకటించారు.

వాటి రూపూ రేఖా ఏదీ లేదు. పాలన ప్రారంభంలో ఉంది. ఇంకా బాలారిష్టాలు అధిగమించలేదు. ప్రజల నుంచి రకరకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. బోలెడు తతంగం ఉంది. మరో వైపు విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో లేనంత విధంగా భారీగా కోతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇంకో వైపు చూస్తే విద్యుత్ చార్జీల భారం మంట పుట్టిస్తోంది. మండు వేసవిలో కీలకమైన పది, ఇంటర్ పరీక్షలతో సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఉన్నాయి. ఇక ఆర్ధిక సమస్యలు ఉండనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు సీఎం జగన్ కు రాజకీయ సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి. మూడేళ్ల కిందట జరిగిన బాబాయ్ హత్య ఘటనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనపై ఉన్న కేసులు చివరి దశకు వస్తున్నాయి. అప్పు చేయనిదే పూడగడవని దుస్థితి ఏపీకి దాపురించింది. ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్టు ప్రభుత్వం కూడా కొత్త సమస్యలను సృష్టించుకుంటోంది అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ అని కొందరిని తీసుకుని భర్తీ చేస్తే పోయేది కానీ ఏకంగా పునర్ వ్యవస్థీకరణ పేరిట అతి పెద్ద సాహసానికి జగన్ దిగిపోయారు. మొత్తం మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ఆయన తీసుకున్నారు.
Also Read: AP New Cabinet: తాజా మాజీ మంత్రులు జగన్ కు షాకివ్వనున్నారా?
ఘడియ ఘడియకో పేరు
మరో రెండు రోజుల్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. ఇంతవరకూ ఒక తుది రూపం రాలేదు. పూట పూటకు.. ఘడియ ఘడియకు పేర్లు మారుతున్నాయి. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సీఎం జగన్ అనుకూల మీడియా కొందరివి, వ్యతిరేక మీడియా మరికొందరి పేర్లను ఆశావహుల పేర్ల జాబితాలను తెరపైకి వచ్చి వారిలో కాక రేపుతున్నాయి. పలానా వ్యక్తికి ఈ అంశాలు అనుకూలం, ఇవి ప్రతికూలాంశాలు అంటూ చెబుతుండడంతో అసలు వారికి పదవి వస్తుందో? లేదో? అన్న అనుమానాలు వ్యక్తం చేసి గందరగోళాన్ని స్రుష్టిస్తున్నారు. ఇపుడు కొత్తగా మంత్రివర్గం ఏర్పాటు కాబోతోంది. ఇందులో ఎవరు ఉంటారో తెలియదు. ఎలా చూసుకున్నా ఇరవై నాలుగు మందికి మాత్రమే అక్కడ చోటు ఉంది. అంటే జగన్ తప్ప మొత్తం 150 మందిలో తొలి ఇరవై నాలుగు మందినీ తొలగించినా మరో ఇరవై నాలుగు మందికే చాన్స్ అన్న మాట. ఇపుడు చూస్తే అందులో కొందరిని కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు. అంటే నలభై మందికే చాన్స్ టోటల్ జగన్ అయిదేళ్ళ ఏలుబడిలో దక్కుతుంది. మరి మిగిలిన 110 మంది సంగతి ఏంటి. వారిలో కొందరు ఆశలు వదులుకున్న కనీసంగా అరవై డెబ్బై మంది దాకా ఆశలు పెట్టుకునే ఉంటారు కదా. అందువల్ల మంత్రి పదవుల విషయంలో అనవసరంగా తేనె తుట్టెను జగన్ కదల్చారు అని అంటున్నారు. దాని వల్ల పాత కొత్త నేతల అసంతృప్తులతో వైసీపీ పూర్తిగా ఇబ్బందులో పడుతోంది అంటున్నారు. రాజీనామా చేసిన మంత్రులు బయటకు సంతోషంగా ఉన్నారు కానీ లోపల మాంత్రం రగిలిపోతున్నారు. దానికి కారణం వారి పదవులు తొలగించడానికి బలమైన రీజన్ ఏదీ లేకపోవడం. ఫలానా కారణం అని చెబితే అర్ధం చేసుకుంటారు. కానీ నాడు హామీ ఇచ్చాను కాబట్టి నేడు మాజీలు కండి అంటే ఎవరూ తట్టుకోలేరు.

అకారణంగా..
‘వేసినప్పుడు వేపకొమ్మ..తీసినప్పుడు మాత్రం అమ్మవారు’ అన్న నానుడి మన నేతలకు ఇట్టే సరిపోతుంది. ఒకసారి కుర్చీ ఎక్కిన వారిని దిగమంటే కోపం వస్తుంది. తాజా మాజీల్లో ఒకరిద్దరిపైన తప్పించి మిగతావారిపై ఎటువంటిఅవినీతి ఆరోపణలు లేవు. అలాగే అన్నిరకాల స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల్లో వైసీపీని గెలిపించుకుని వచ్చారు. దానికి తోడు రెండేళ్ళుగా కరోనా సైతం పీడించి ఎవరినీ బయటకు పోనీయలేదు
ఇలా అన్ని వైపులా మంత్రులు సతమతమవుతూ కూడా వైసీపీ ని కాసుకుంటూ వస్తున్నారు. జగన్ మీద ఒక్క మాట అనకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ టైమ్ లో అది కూడా ఎన్నికలకు గట్టిగా రెండేళ్లు లేని వేళ ఇంతటి ఆపరేషన్ అవసరమా అన్న చర్చ అయితే వస్తోంది. ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా మరింతమంది రగులుతూనే ఉంటారు. ఇక మాజీలు అయిన వారి సంగతి వేరే కధ.టోటల్ గా చూస్తే వైసీపీ ఇపుడు అతి పెద్ద సంక్షోభంలో చిక్కుకుంటోందా అన్న డౌట్లు వస్తున్నాయి. మాజీలు అయిన మంత్రులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మంతనాలు జరిపి బుజ్జగిస్తున్నారు అంటే సీన్ ఎంతటి సీరియస్ గా ఉన్నది అర్ధమవుతోంది. ఇక మంత్రి పదవికి బదులుగా ఏ హోదా ఇచ్చినా ఏ ప్రభుత్వ పదవి ఇచ్చినా సాటి కావు కదా అన్నదే మాజీల బాధ. అలాగే అనేక లెక్కలు సామాజిక సమీకరణల వల్ల ఆశావహులకు కూడా చాలా మందికి మొండి చేయి చూపించే ప్రమాదం ఉంది. దాంతో వారూ వీరూ అని కాకుండా టోటల్ గా ఆ 24 మంది జగన్ తప్ప అంతా అసంతృప్తిలో మునిగితేలేలా ఈ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం అవుతుందా అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ నెల 11 తరువాత ఏం జరుగుతుంది ఎంత మంది అసమ్మతి రాగాలు వినిపిస్తారు అన్నది లెక్క వేసుకోవాలి అనే అంటున్నారుట.