Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడినా.. రాసినా అవి తూటాల్లా బయటకు వస్తాయి. ఆయన సంధించే ప్రశ్నలు ప్రభుత్వాన్ని బలంగా తాకుతాయి. సర్కారులను ఆగమాగం చేస్తుంటాయి. అచ్చతెలుగులో కవితాత్మకంగా.. సూటిగా సుత్తిలేకుండా పవన్ వేసే ప్రశ్నలు ప్రభుత్వాల్లో కదలికలు తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘శత్రువుల’ గురించి పొగుడుతూ చేసిన ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. పవన్ ఎవరి గురించి ఈ ట్వీట్ చేశాడు? ఆ కథేంటి ? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కళ్యాణ్ ఓ పుస్తకాల పురుగు అంటారు. ఆయన సాహిత్యం చదువుతుంటారు. ప్రపంచ, సామాజిక, జ్ఞానానికి సంబంధించిన అనేక విషయాలపై పవన్ కు గట్టి పట్టుంది. ఆయనకు స్ఫూర్తిగా నిలిచిన ఎన్నో పుస్తకాల్లోని పంక్తులను సమాయనుసారం ట్విట్టర్ లో పోస్ట్ చేసి అధికార పక్షాలపై సంధిస్తున్నారు. కవితాత్మకంగా నిగ్గదీసి అడుగుతుంటారు.
తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో మరో సంచలన ట్వీట్ చేశాడు. ఆ కొటేషన్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ‘“శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే..” అంటూ కొన్ని ఇంగ్లీష్ పదాలను కూడా పవన్ కళ్యాణ్ యాడ్ చేశాడు. సోషలిస్ట్ దిగ్గజం రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ప్రతిబింబించేలా.. బీసీ, ఎస్సీలు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతపై పవన్ ట్వీట్ చేశారు. రామ్ మనోహర్ లోహియా ఆలోచనా విధానాన్ని ప్రతిఫలించేలా రచయిత వాకాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని పవన్ వివరించారు.
The following quote by Writer’Sri Vakada Srinivas’ reflects the RamManohar Lohia’s thought process on the ascension of BC’s & SC’s into power.
“శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే…”— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2022
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ఆసక్తిగా మారింది. మంచి కోటేషన్ అని పెట్టారా? లేదా ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ వైరుధ్యాలు ఏమైనా ఉన్నాయా? అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ అధికార బలంపై పవన్ ఈ ట్వీట్ చేశాడని.. వారి అధికారానికి భయపడి లొంగిపోవడం మూర్ఖత్వం అంటూ ప్రభుత్వ చర్యలను ఎదురించలేని వారిపైనే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇక డ్రగ్స్ కేసులో నిహారిక పేరు బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ ట్వీట్ ఆమె గురించా? అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అది టీడీపీపైనా? లేక మరేదైనా విషయమా? అన్నది తేలాల్సి ఉంది.
పవన్ కళ్యాణ్ ఇలా కవుల వ్యాఖ్యలను షేర్ చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ ఇలాంటివి జాతీయ, అంతర్జాతీయ మేధావుల కొటేషన్లు షేర్ చేశారు.వాకాడ శ్రీనివాస్ వ్యాఖ్యలను గతంలోనూ ఉటంకించారు. ప్రస్తుతం శత్రువుల బలాలను.. మన బలహీనతలను వివరిస్తూ పవన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.