ఏపీ సర్కార్ బండి నడవడం లేదు. ఎన్ని అప్పులు చేసినా సరిపోవడం లేదు. అప్పులు ఎక్కువై ఆర్బీఐ కూడా ఖాతాల్లో సొమ్మును తీసేసుకుంది. దీంతో ఎలా? ఏం చేయాలి? ఆదాయం ఎలా పెంచాలి? అని ఆలోచించిన జగన్ సర్కార్ తాజాగా మాస్టర్ ప్లాన్ వేసింది. ‘చెత్త’పై పన్ను వేయాలని డిసైడ్ అయ్యింది. ఆఖరుకు చెత్తను కూడా వదలరా? అని జనాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏపీలో ‘పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్’ (క్లాప్) కార్యక్రమాన్ని ఏపీ పురపాలకశాఖ నెత్తిన ఎత్తుకుంది. మొదటి దశలో 16 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. రెండో దశలో అన్ని మున్సిపాలిటీల్లో దీన్ని అమలు చేస్తారు. ఈనెల 15న కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
క్లాప్ అమలు కోసం మున్సిపాలిటీ పాలకవర్గాలు వెంటనే సమావేశమై ఆమోదం పొందించుకోవాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఈ క్రమంలోనే అధికారులతో ఏజెండాను రెడీ చేస్తున్నారు. నివాసాల సంఖ్య, వ్యర్థాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను బట్టి ఒక్కో చోట ఒక్కవిధంగా పన్ను వేయాలని కమిషనర్లు ప్రతిపాదిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లోనూ నివాసాలు, నివాసేతర నుంచి వ్యర్థాలు సేకరించి వినియోగ రుసుములు వసూలు చేయాలన్న నిర్ణయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఆందోళన వ్యక్తమైంది. పలు చోట్ల పురపాలక సభ్యులు సైతం కరోనా వేళ వినియోగరుసుములు వసూళ్లు ప్రతిపాదించడంపై వ్యతిరేకించారు.
గృహాలకు 120 రూపాయల పన్ను ఉండగా.. మురికివాడల్లోని గృహాలకు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. స్టార్ హోటళ్లకు 15వేల వరకు పన్నులు వేస్తున్నారు. దుకాణాలకు రూ.300నుంచి రూ.5వేలలోపు వేస్తున్నారు.సినిమా హాళ్ల నుంచి సూపర్ మార్కెట్ల దాకా ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా ‘చెత్త’పై పన్ను వేస్తూ ఏపీ సర్కార్ భారీగానే వసూళ్లు చేస్తోంది. ఖాజానా నింపుకుంటోంది.