Homeజాతీయ వార్తలుఅసోం రాజకీయాలను షేక్ చేస్తున్న కొత్త నేత

అసోం రాజకీయాలను షేక్ చేస్తున్న కొత్త నేత

akhil gogoi
అఖిల్ గొగొయ్ అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు రాష్ర్టమంతా మార్మోగుతున్న పేరు. పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపించాడు. జైల్లో నుంచే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి తన పట్టు నిరూపించుకున్నాడు. చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిది లేదని ఆయన విశ్వాసం. అందుకే జైల్లో ఉన్నా ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నేతగా ఇప్పుడు పేరుపొందారు.

జైలు నుంచి ఎన్నికైన తొలి వ్యక్తిగా..
జైలు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తొలి అస్సామీగా అఖిల్ గొగోయ్ చరిత్ర సృష్టించారు. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సురభి రాజ్ కోన్ పై విజయం సాధించారు. 11.875 ఓట్ల మెజార్టీ సాధించి అందరి అంచనాలను తలకిందులు చేశారు దేశంలో ఇప్పటి వరకు జైలు నుంచి ఎన్నికైన వ్యక్తి జార్జి ఫెర్నాండెజ్ ఒక్కరే. ఇప్పుడు ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా గొగోయ్ నిలిచారు.

కేసులు పెట్టినా వెరవకుండా..
అఖిల్ గొగోయ్ ని 2019 డిసెంబర్ లో అరెస్టు చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న గొగోయ్ పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసునమోదు చేసి జైల్లో పెట్టింది. అయితే జైలు నుంచే అఖిల్ గొగోయ్ తన పోరాటాన్ని చేశారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు. తాను అనుకున్నది సాధించాలనే తపనతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాడు. నేతలెందరొచ్చినా అంతిమ విజయం తనదే అనే ధీమాతో చివరి దాకా పోరాటం చేసి విజయఢంకా మోగించారు.

తల్లి సహకారంతోనే..
అఖిల్ గొగోయ్ కు తన తల్లి అయిన ప్రియారా గొగోయ్ ప్రచారం చేశారు. ఎలాగైనా తన కొడుకును గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. మేధావుల సహకారం తీసుకుని ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శివసాగర్ ఎన్నికపై అఖిల్ గొగోయ్ విజయం సాధించడం విశేషం.

అసెంబ్లీ సాక్షిగా..
ఎవరి మద్దతు లేకున్నా స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించిన అఖిల్ గొగోయ్ అసెంబ్లీ వేదికగా పోరాటం చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇన్నాళ్లు వీధుల వెంట తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేసిన గొగోయ్ అసెంబ్లీ ద్వారా తన వాణిని వినిపించే అవకాశం కలిగింది. మొదట కాంగ్రెస్ పార్టీ మద్దతస్తామని చెప్పినా తరువాత తన అభ్యర్థిని నిలిపింది. ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. అఖిల్ గొగోయ్ 1995-96లో కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడిగా పని చేశారు. రైతు ఉద్యమాల్లో సైతం పాల్గొన్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దీంతో పోరాటాల వీరుడిగా పేరున్న గొగోయ్ కు సముచిన స్థానమే దక్కిందని పలువురు శ్లాఘించారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular