మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని ఆయన అన్నారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని కేసీఆర్ అన్నారు. దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని తెలిపిన సీఎం కేసీఆర్… ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని ఆకాంక్షించారు.
అంతిమంగా రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిఎం వారికి పలు సూచనలు చేశారు.