Homeజాతీయ వార్తలుAbdul Karim Telgi: బార్ డాన్సర్ల పై 93 లక్షలు కుమ్మరించాడు.. మద్యం మత్తులో అనుకున్నారు.....

Abdul Karim Telgi: బార్ డాన్సర్ల పై 93 లక్షలు కుమ్మరించాడు.. మద్యం మత్తులో అనుకున్నారు.. కానీ ఆ తర్వాతే తెలిసింది అసలు కథ!

Abdul Karim Telgi: అది దేశ ఆర్థిక రాజధాని ముంబై.. ఖరీదైన ఆ ప్రాంతంలో అత్యంత ఖరీదైన హోటల్ అది. చెవులు పగిలే విధంగా శబ్దం.. వెలుగుతూ పోతున్న విద్యుత్ దీపాలు.. హోరెత్తిస్తున్న రాక్ బ్యాండ్.. వాటికి తగ్గట్టుగా వచ్చిన వారిని అలరిస్తున్న అందమైన అమ్మాయిలు.. ఆ పాటలకు తగ్గట్టుగా డ్యాన్సులు వేస్తున్నారు.. అక్కడి వాతావరణం వెస్ట్రన్ కల్చర్ ను మించి ఉంది. అక్కడ జరుగుతున్నవన్నీ విచ్చలవిడిగా ఉన్నాయి. మందు, విందు.. ఇంకా చాలానే జరుగుతున్నాయి.

అలాంటి వాతావరణంలోకి ఓ వ్యక్తి అకస్మాత్తుగా ప్రవేశించాడు. కళ్ళకు నల్లటి కళ్లద్దాలను..ఒంటికి ఖరీదైన కోట్ వేసుకొని వచ్చాడు. వాస్తవానికి ఆ పార్టీలోకి బ్రీఫ్ కేస్ పట్టుకొని రావడం నిషిద్ధం. కానీ ఆ వ్యక్తి ఎటువంటి ఇబ్బంది లేకుండానే నేరుగా వచ్చాడు. సిగరెట్ ముట్టించుకుంటూ ఆ అమ్మాయిలు డాన్సులు వేసే చోటికి వెళ్ళాడు.. వారితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. దానికి ఆ అమ్మాయిలు కూడా నో చెప్పలేదు. అంతే ఒక్కసారిగా సూట్ కేస్ తెరిచాడు. వందలు, 500 నోట్ల కట్టలు తెరిచి వారిపై కాసుల వర్షం కురిపించాడు.. దాదాపు అర్ధగంటకు మించి అతడు అలా చల్లుతూనే ఉన్నాడు.. ఆ అమ్మాయిలు మరింత రెట్టించిన ఉత్సాహంతో డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు. అప్పట్లో ఈ సంఘటన తెలిసినప్పటికీ చాలా మీడియా సంస్థలు రాయలేదు. పైగా ఆ కాలంలో ఇప్పటి మాదిరిగా సోషల్ మీడియా బలంగా లేదు.. ఆ వ్యక్తి గురించి అప్పుడే కాదు ఇప్పుడు కూడా చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ ఘటన జరిగి రెండు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ.. ఆ సంఘటన చర్చకు వస్తే హై ప్రొఫైల్ వ్యక్తులు ఒకరకంగా వణికి పోతుంటారు.

అంతలా ఆ డబ్బు చల్లిన వ్యక్తి దావూద్ ఇబ్రహీం తమ్ముడు కాదు. చోటా షకిల్ అనుచరుడు కాదు.. ధీరుబాయ్ అంబానికి చుట్టం కాదు.. ముకేశ్ అంబానికి స్నేహితుడు కాదు.. ఆ వ్యక్తి పేరు తెల్గీ అలియాస్ అబ్దుల్ కరీం తెల్గీ. ఈ పేరు ఇండియాను షేక్ చేసింది.. ఇంతకీ అతడు ఏం చేశాడు? ఎటువంటి నేపథ్యం లేకుండా ఇండియాలో ఎందుకు ఇలా వణికించాడు? అతడికి అంతలా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నార్థకాలకు ఒక్కొక్క సమాధానం రోమాలు నిక్కబొడిచే విధంగా ఉంటుంది.

తెల్గీ.. ఓ సాధారణ పండ్ల వ్యాపారి.. అయితే ఇతడికి డబ్బు సంపాదించాలని కోరిక విపరీతంగా ఉండేది.. అదే అతడిని అంచలంచలుగా కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడే విధంగా చేసింది.. పండ్ల వ్యాపారిగా అతడు ఎంతో మందికి సుపరిచితుడు. తన వద్దకు వచ్చే కస్టమర్ల ద్వారా వివిధ రకాల మోసాలను తెలుసుకున్నాడు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత భారీ కుంభకోణానికి సూత్రధారిగా నిలిచాడు. దాదాపు 30 వేల కోట్ల స్టాంపుల కుంభకోణానికి పాల్పడి.. దేశ ఆర్థిక రంగాన్ని షేక్ చేశాడు. అధికారిక రికార్డులను స్తంభింప చేశాడు.. అంతేకాదు 132 బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేశాడు.. వచ్చిన డబ్బులు మొత్తం అందులో నిల్వచేసాడు. ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశాడు. ఊహించలేని, అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ఆనందించడం మొదలుపెట్టాడు.. ఇతడు చేసిన కుంభకోణం 2001లో వెలుగులోకి వచ్చింది. న్యాయస్థానం 2006లో శిక్ష విధించింది..

 

View this post on Instagram

 

A post shared by INVESTUPMEDIA (@investupmedia)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular