దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడు వారాల లాక్డౌన్ ను మరింత కాలం పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన సూచనకు దేశ మద్దతు లభిస్తున్నది. కనీసం ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగించవలసిందే అని స్పష్టం చేసాయి.
గడువు ప్రకారం ఈ నెల 14న లాక్డౌన్ తొలగిస్తూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా తయారవుతాయని ఆయా ప్రభుత్వాధినేతలు భావిస్తున్నారు. దేశంలో నమోదవుతున్న కేసులలో మూడవ వంతు మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అసోం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణలో ఉండటం గమనార్హం. లాక్డౌన్ను కొనసాగించడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కోరుతున్నాయి.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 891 కేసులు నమోదు కాగా 45 మంది మృతి చెందారు. దానితో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో తాము లాక్డౌన్ కొనసాగింపు కోరుకుంటున్నామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె చెప్పారు. ‘ఏప్రిల్ 15 తర్వాత లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయబడుతుందని ఎవరూ అనుకోవద్దని’ మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేష్ తోప్ స్పష్టం చేశారు.
తబ్లిగీ జమాత్ కారణంగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఉత్తరప్రదేశ్ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నమోదైన 305 కేసుల్లో 159 తబ్లిగీతో సంబంధం ఉన్నవారివేనని, ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ను ఎత్తివేయాల్సిన అవసరంలేదని వారు పేర్కొన్నారు.
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అసోంకు రావాలనుకునే వారిని అడ్డుకుంటామని, శాశ్వత నివాసం ఏర్పర్చుకున్న వారికి కూడా కొంతకాలంపాటు ఐఎల్పీ (ఇన్నర్లైన్ పర్మిట్)వంటి పరిస్థితి అవసరమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వా పేర్కొన్నారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ప్రభుత్వం విశ్వసించిన తర్వాత రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ప్రకటించారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ ప్రభుత్వాలు సహితం ఇటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నాయి.