Summer Pani Puri: ఎండాకాలంలో సాధ్యమైనంతవరకు శరీరానికి చలవచేసే పదార్థాలను తినాలని వైద్యులు చెబుతుంటారు. మజ్జిగ, పెరుగు, నిమ్మకాయ షర్బత్, పుదీనా షర్బత్, చల్లని నీళ్లు, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కర్బుజా, కీరా దోసకాయ్ తీసుకోవాలని చెబుతుంటారు. మధుమేహం, రక్త పోటు వంటి సమస్యలు ఉన్నవారు తమ ఆరోగ్య స్థితి ఆధారంగా వీటిని తీసుకోవాలని చెబుతుంటారు.
ఎండాకాలంలో లభించే పండ్లను కూడా తీసుకుంటే శరీరానికి చలవ చేస్తుందని వైద్యులు చెబుతుంటారు.. అయితే కొందరు మాత్రం నోటిని కట్టేసుకోరు. సాయంత్రం పూట బయట దొరికే చిరుతిళ్లను తింటుంటారు. అందులో ప్రధానమైనది పానీపూరి. ఒకప్పుడు పట్టణ, నగర ప్రాంతాలకు మాత్రమే పానీ పూరి బండ్లు పరిమితమయ్యేవి. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా పానీపూరి బండ్లు వచ్చేశాయి. సాయంత్రం అయిందంటే చాలు చాలామంది పానీపూరిని ఇష్టంగా తింటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. కొంతమంది నిర్వాహకులు పానీపూరి తయారీలో శుభ్రతను పాటించరు. దానివల్ల రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో పానీపూరి తిని ఏడు సంవత్సరాల బాలుడు చనిపోయాడు. ఈ వార్తల నేపథ్యంలో పానీపూరి తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.. పానీపూరి తయారీలో కలుషితమైన నీటిని వాడితే.. అది తిన్నవాళ్లకు ప్రమాదాలు తప్పవు. కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా ఉంటుంది. నీటిలో నుంచి నోటిలోకి వచ్చిన తర్వాత అది వేగంగా వ్యాపిస్తుంటుంది. ఉడకబెట్టిన ఆలు, శనగలు ఎండ వేడి వల్ల పాడవుతాయి. అలాంటి వాటిని తింటే కచ్చితంగా వాంతులు వస్తాయి. విరోచనాలు కూడా చోటుచేసుకుంటాయి. దీనివల్ల శరీరం డిహైడ్రేషన్ కు గురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రాణాపాయం సంభవిస్తూ ఉంటుంది.
సాధ్యమైనంత వరకు పానీపూరిని బయట తినకపోవడం మంచిదని వైద్యులు అంటున్నారు. ఒకవేళ అంతగా తినాల్సి వస్తే శుభ్రంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని తినాలని చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు పానీపూరి విషయంలో జాగ్రత్తగా ఉంటేనే ఆరోగ్యానికి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే కలుషితమైన నీటి ద్వారా ఈ. కోలై బ్యాక్టీరియా అభివృద్ధి చెంది శరీరంలోకి ప్రవేశిస్తుందని.. తద్వారా అనారోగ్యానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
