
కరోనా-లాక్ డౌన్ తో ప్రజల చేతిలో రూపాయి లేని పరిస్థితి. రూపాయి రూపాయికి జనం వెతుక్కుంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరిగోసపడుతున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఇలాంటి దోపిడీ అవసరమా మోడీజీ అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నెత్తిన భారం మోపి దోచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనికరం లేని బీజేపీ సర్కార్ పై ఆడిపోసుకుంటున్నారు.
20 లక్షల కోట్లు అంటూ ప్రకటించిన మోడీ ప్యాకేజీ ఒట్టి గాలిబుడగ అని తేలిపోయింది. ప్రజల ఉద్యోగాలు నిలబడలేదు. జీతాల లోటు భర్తీ కాలేదు. ఏ పథకమూ దరిచేరలేదు. వట్టి గ్యాస్ అని తెలంగాణ సీఎం సహా దేశంలోని సీఎంలంతా మోడీజీ ప్యాకేజీపై నిప్పులు పోశారు.
పోనీ పథకాలు , ఆర్థిక సాయం చేయడంలో మోడీకి చేయి రాలేదు సరే.. కనీసం ధరలు అయినా పెంచకపోతే ప్రజలు బతుకుతారు కదా అంటే.. దానిమీద మోడీ సార్ శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా వ్యవహరిస్తున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఎనిమిదో రోజు కూడా పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు దేశ ప్రజలకు వాతలు పెట్టాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర వరుసగా ఎనిమిదో రోజునాడు రూ.62పైసలు పెరిగింది. డీజీల్ ధర రూ.64 పైసలు పెరిగింది. దీంతో పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.78కి చేరగా.. డీజిల్ ధర రూ.74.03కి చేరింది.
గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ కు ఏకంగా రూ.4.52 రూపాయలు పెరగగా.. డీజిల్ ధర కూడా రూ. 4.64 రూపాయలు పెరిగింది.
ఇలా సామాన్యుడికి ఆదాయం లేకుండా చేసి ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకు వస్తున్న ప్రజల ఆదాయాన్ని పెట్రోల్, డీజిల్ తో పీల్చిపిప్పి చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు సామాన్యులు. ఇంత కరువులో ఈ పెంచుడేంది మోడీసార్ అంటూ నిలదీస్తున్నారు.